ఏడాది నుంచి ఎదురు చూస్తున్న గోదావరి జిల్లా వాసుల కల నెరవేరింది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వరకు వందేభారత్ రైలు పరుగులు పెట్టనుంది. దీనికి సంబంధించి దక్షిణ మధ్య రైల్వే జీఎం అధికారిక ప్రకటన విడుదల చేశారు. సంక్రాంతి పండుగ కానుకగా.. వచ్చే ఏడాది జనవరి 12వ తేదీ నుంచి నరసాపురం – చెన్నై మధ్య వందే భారత్ రైలు నడుస్తుందని రైల్వే శాఖ వెల్లడించింది. దీనికి సంబంధించిన అడ్వాన్స్ రిజర్వేషన్ బుకింగ్ కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ రైలు చెన్నై – నరసాపురం – చెన్నై మధ్య రాకపోకలు సాగిస్తుందని రైల్వే శాఖ వెల్లడించింది. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ కూడా తన అధికారిక సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గోదావరి జిల్లా వాసుల కోరికను నెరవేర్చినందుకు నరసాపురం పార్లమెంట్ వాసుల తరఫున రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్కు ధన్యవాదాలు తెలిపారు.
Also Read : జగన్ చుట్టూ ఏం జరుగుతోంది..? రౌండప్ అవుతున్నారా..? భూకంపం సృష్టిస్తున్న అత్యంత సన్నిహితులు..!
ప్రస్తుతం చెన్నై – విజయవాడ – చెన్నై మధ్య నడుస్తున్న వందే భారత్ రైలును భీమవరం వరకు పొడిగించాలనే డిమాండ్ తొలి నుంచి వినిపిస్తోంది. వారంలో మంగళవారం మినహా మిగిలిన 6 రోజుల పాటు ఉదయం 5.30 గంటలకు చెన్నై నుంచి బయలుదేరి రేణిగుంట, నెల్లూరు, ఒంగోలు, తెనాలి మీదుగా విజయవాడకు మధ్యాహ్నం 12. 10 గంటలకు చేరుతుంది. ఈ రైలు తిరిగి మధ్యాహ్నం 3.20 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి న నెల్లూరు, రేణిగుంట మీదుగా రాత్రి 10 గంటలకు చెన్నై చేరుతుంది. అయితే ఈ రైలు దాదాపు 3 గంటల పాటు విజయవాడలో ప్లాట్ఫామ్పై ఖాళీగా ఉంటోంది. దీని వల్ల ఇతర రైళ్ల రాకపోకలపై ప్రభావం చూపుతోంది. ఇదే సమయంలో ఈ రైలును గుడివాడ మీదుగా భీమవరం వరకు పొడిగించాలని ఆ ప్రాంత వాసులు కోరారు. గోదావరి జిల్లాల నుంచి నేరుగా చెన్నైకి కేవలం సర్కార్ మాత్రమే నడుస్తోంది. దీంతో అటు వ్యాపార లావాదేవీలతో పాటు తిరుపతి వెళ్లే ప్రయాణీకులకు కూడా ఎంతో ఉపయోగపడుతుందని కోరారు.
Also Read : వైవీ సుబ్బారెడ్డి అరెస్ట్..? ఆయన్ను కూడా..?
ప్రయాణీకుల డిమాండ్ను పరిశీలించిన రైల్వే శాఖ.. భీమవరం వరకు పొడిగించడం సాధ్యం కాదని తేల్చేసింది. రైలుకు వాటర్ ఫిలింగ్, క్లీనింగ్ భీమవరంలో లేదని.. కాబట్టి పొడిగింపు సాధ్యం కాదని తేల్చేశారు. అయితే కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజులు వేరు వేరుగా రైల్వే శాఖ మంత్రిని, రైల్వే బోర్డుకు వినతి పత్రాలు ఇచ్చారు. నరసాపురం వరకు పొడిగించాలని కోరారు. దీంతో సాధ్యాసాధ్యాలపై పరిశీలించిన రైల్వే శాఖ.. రైలు సమయంలో మార్పులు చేయాల్సి వస్తుందని సూచించింది. దీనికి అన్ని ప్రాంతాల నుంచి సానుకూలత రావడంతో.. రైలును నరసాపురం వరకు పొడిగిస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. జనవరి 12 నుంచి ప్రజలకు అందుబాటులోకి రానున్న చెన్నై – నరసాపురం – చెన్నై వందేభారత్ రైలు వేళలను దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారికంగా ప్రకటించింది. ఈ రైలు నంబర్ 20677/20678 గా ప్రకటించారు. ప్రతిరోజు ఉదయం 5.30 గంటలకు చెన్నై నుంచి బయలుదేరి రేణిగుంట మీదుగా విజయవాడకు 11.40 గంటలకు చేరుతుంది. మధ్యాహ్నం 12.29 గంటలకు గుడివాడ, 1.14 గంటలకు భీమవరం టౌన్ మీదుగా 2.10 గంటలకు నరసాపురం చేరుతుంది. తిరిగి మధ్యాహ్నం 2.50 గంటలకు నరసాపురం నుంచి బయలుదేరి 3.19 గంటలకు భీమవరం, 4.04కు గుడివాడ, 4.50కు విజయవాడ, 5.19కు తెనాలి, 6.29కు ఒంగోలు, రాత్రి 7.39కి నెల్లూరు, 9.50కు రేణిగుంట మీదుగా రాత్రి 11.45 గంటలకు చెన్నై చేరుతుంది. ఈ రైలు ఇటు పశ్చిమ గోదావరి జిల్లా వాసులతో పాటు కోనసీమ, కృష్ణా జిల్లా వాసులకు కూడా ఎంతో ఉపయోగపడుతుందని ప్రయాణీకులు సంతోషం వ్యక్తం చేశారు.

