ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ వ్యూహాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. తాను ఏం చేసినా సరే.. లెక్క పక్కాగా ఉంటుందనేది పవన్ మాట. 2014 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నప్పటికీ.. టీడీపీ – బీజేపీ ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. 2019లో సింగిల్గా పోటీ చేసినప్పటికీ.. తన సత్తా ఏమిటో అందరికీ తెలియజేశారు. ఇక 2024 ఎన్నికల్లో టీడీపీ – బీజేపీ – జనసేన పార్టీలు జత కట్టడం వెనుక పవన్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. “జగన్ గుర్తు పెట్టుకో” అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చి మరీ వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా అధః పాతాళానికి తొక్కేశాడు పవన్. అలాంటి పవన్ రాబోయే ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటి నుంచే వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు.
Also Read : ఆస్ట్రేలియా ఆటగాళ్లను లేపేస్తాం.. ఉగ్ర సంస్థ వార్నింగ్..!
2019 ఎన్నికల్లో కేవలం ఒక్క స్థానంతోనే సరిపెట్టుకున్న జనసేన.. 2024 ఎన్నికల్లో మాత్రం కూటమి పొత్తు కారణంగా పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుని వంద శాతం సక్సెస్ రేట్తో అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. అదే ఊపులో రాబోయే ఎన్నికల్లో మరిన్ని స్థానాల్లో జనసేన సత్తా చాటాలనే లక్ష్యంతో పవన్ పావులు కదుపుతున్నారు. ఇందుకోసం ఈసారి ప్రత్యేక వ్యూహం సిద్ధం చేస్తున్నారు పవన్. గత ఎన్నికల్లో కాపుల ప్రభావం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టిన పవన్.. ఈసారి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా గిరిజనులు ఎక్కువగా ఉండే ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాలను పవన్ టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.
కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం పదవితో పాటు అటవీ, గ్రామీణాభివృద్ధి శాఖలను పవన్ ఎంచుకున్నారు. ఈ రెండు శాఖల వల్ల లాభమేంటి అని అప్పట్లో జనసైనికులు సైతం ఆశ్చర్యపోయారు. కానీ పవన్ మాత్రం.. గిరిజన ప్రాంతాల్లో అటవీ, గ్రామీణాభివృద్ధి శాఖ సౌజన్యంతో మౌలిక వసతుల కల్పనకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో ఎంతో కాలంగా ఉన్న ఢోలీ కష్టాలకు చెక్ పెట్టేలా రహదారులు నిర్మిస్తున్నారు. అలాగే ప్రతి గ్రామానికి సోలార్ వెలుగులు ఏర్పాటు చేస్తున్నారు. గిరిజనులు మైదాన ప్రాంతాల్లోకి వచ్చి ఆధునిక జీవితం అనుభవించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గిరిపుత్రుల వ్యాపారాభివృద్ధికి సహకరిస్తున్నారు.
Also Read : దానంపైనే బీఆర్ఎస్ గురి..? ఎందుకీ రివేంజ్..?
తరచూ అరకు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో పవన్ పర్యటిస్తున్నారు. గిరిజనులతో మమేకం అవుతున్నారు. తన పుట్టిన రోజు, పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కూడా గిరిజనుల మధ్యనే అడవిలో నిర్వహించారు. మీకు ఏ కష్టం వచ్చినా సరే నేనున్నా.. అంటూ భరోసా ఇస్తున్నారు. తన సినిమాల్లో కూడా గిరిజన వాతావారణం గురించే ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. తాజాగా వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అడవి నేపథ్యంలోనే షూటింగ్ చేశారు. ఇందుకు ప్రధాన కారణం.. టార్గెట్ ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాలు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పటి వరకు ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్, వైసీపీ తప్ప ఇతర పార్టీలు గెలిచిన దాఖలాలు లేవు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థి కిషోర్ చంద్ర డియో గెలవగా.. 2014, 19, 24 ఎన్నికల్లో వైసీపీ హ్యాట్రిక్ విజయం సాధించింది. దీంతో గిరిజన ఓటర్లను తన వైపు తిప్పుకునేందుకు పవన్ మాస్టర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.
2024 ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచిన పవన్.. ఆ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశారు. అయితే ఈ సారి మాత్రం పిఠాపురం బదులుగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీని వల్ల శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలో కూడా జనసేన పార్టీ అభ్యర్థుల గెలుపుపై ప్రభావం ఉంటుందనేది పవన్ లెక్క అన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే పవన్ సోదరుడు ఎమ్మెల్సీ నాగబాబు ఎచ్చెర్ల నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. దీంతో పవన్ టార్గెట్ ఉత్తరాంధ్ర అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

