ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన తర్వాత చాలామంది వైఖరి మారిపోతు ఉంటుంది. చట్టసభలను జాతీయస్థాయిలో అయినా రాష్ట్రస్థాయిలో అయినా కొంతమంది లైట్ తీసుకుంటారు. పార్టీ అధిష్టానాలు ఎంత హెచ్చరించినా సరే వారి వైఖరిలో మాత్రం మార్పు రాదు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి సొంత వ్యాపారాల మీద దృష్టి పెడుతూ ఉంటారు. అందుకే ఇప్పుడు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ టిడిపి ఎంపీలకు వార్నింగ్ ఇచ్చారు. బడ్జెట్ సమావేశాలకు ఎంపీలు హాజరు కాకపోతే కఠిన పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం.
Also Read : రిటైర్డ్ ఐఏఎస్ అధికారికి అన్ని శాఖలా..!
నియోజకవర్గాలకు నిధులు సాధించే బాధ్యత ఎంపీలకు ఉందని.. ప్రతి ఒక్కటి రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుంది అనుకోవడం అవివేకం అంటూ కొంతమంది ఎంపీలపై లోకేష్ సీరియస్ అయినట్లు సమాచారం. బడ్జెట్ సమావేశాలు అత్యంత కీలకమని.. ఎంపీలు పార్లమెంట్లో మాట్లాడటం పై ప్రాక్టీస్ చేయాలంటూ లోకేష్ సూచించారు. ఢిల్లీ వెళ్లి సొంత వ్యాపారాలకు సంబంధించిన చర్చలు జరపటం మినహా పార్లమెంట్లో మాట్లాడటం లేదని.. సీనియర్లను, మాజీ ఎంపీలను అడిగి కొత్త వారు నేర్చుకోవాలని.. రాజకీయ భవిష్యత్తు ఉండాలంటే చట్టసభల్లో మాట్లాడాలని.. అప్పుడే ప్రజల్లో గుర్తింపు ఉంటుందని లోకేష్ పేర్కొన్నారు.
Also Read : జాతీయ పార్టీగా జనసేన.. పవన్ కీలక నిర్ణయం..!
రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలపై కూడా కేంద్రం ముందు ప్రస్తావించాలని.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలను పార్లమెంట్ వేదికగా ప్రస్తావించి.. తమ తమ నియోజకవర్గాలకు ఏం కావాలో అక్కడే అడగాలని ఎంపీలకు లోకేష్ సూచించినట్లు సమాచారం. రైల్వే బడ్జెట్ పై కూడా దృష్టి పెట్టాలని.. కొత్త రైల్వే మార్గాల కోసం ప్రయత్నాలు చేయాలని ఎంపీలను కోరినట్లు సమాచారం. పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యే ముందు ఎంపీలు అందరూ ఒకసారి సమావేశమై.. ఎజెండా ఏమిటో చర్చించుకోవాలని.. అవసరమైతే పార్టీ ప్రధాన కార్యాలయ సహకారం తీసుకోవాలని లోకేష్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత ఎంపీలతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమావేశం అవుతారని కూడా చెప్పినట్లు సమాచారం.

