తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న వ్యవహారాలపై గత కొన్నాళ్లుగా అనేక చర్చలు ఉన్నాయి. పార్టీ నేతలు క్రమశిక్షణ తప్పారనే విమర్శలు వినిపించాయి. కొందరు నేతలు బహిరంగంగా విమర్శలు చేసుకోవడం తలనొప్పిగా మారింది. ఈ సమయంలో అధిష్టానం ఎలా వ్యవహరిస్తుంది అనే దానిపై చాలా అనుమానాలు ఉన్నాయి. చూసి చూడనట్లు వదిలేస్తున్నారని విమర్శలు సైతం వచ్చాయి. సాధారణంగా చంద్రబాబు నేతలు విషయంలో చాలా సున్నితంగా ఉంటారు. ఎవరినైనా దూరం పెట్టాలి అనుకుంటే సైలెంట్ గా పక్కన పెట్టేయడం చూస్తూనే ఉంటాం. ఇక ఇప్పుడు టిడిపిలో పరిస్థితి మారింది అంటున్నాయి రాజకీయ వర్గాలు.
Also Read : మరో ఎమ్మెల్యేకి టీడీపీ అధిష్టానం క్లాస్..?
పార్టీలో లోకేష్ ఆధిపత్యం పెరిగిన తర్వాత నేతల విషయంలో చంద్రబాబు కంటే పూర్తి భిన్నంగా లోకేష్ వ్యవహరిస్తున్నారని కామెంట్స్ వినపడుతున్నాయి. ముఖ్యంగా నియోజకవర్గాల్లో నేతల మధ్య విభేదాలు ఉంటే లోకేష్ వాటిని సీరియస్ గా పరిగణిస్తున్నట్లు సమాచారం. తాజాగా కావాలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పార్టీ కార్యాలయానికి వచ్చి.. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కొలికిపూడి శ్రీనివాసరావుతో భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా నియోజకవర్గంలో సీనియర్ నేత సుబ్బానాయుడు వ్యవహారం చర్చకి వచ్చింది. 2024 ఎన్నికల్లో సుబ్బానాయుడు పార్టీ అధిష్టానం నచ్చజెప్పడంతో సీటు వదులుకొని కావ్య కృష్ణారెడ్డికి ఇచ్చారు.
Also Read : గుడ్ న్యూస్: ఫ్లైట్ టికెట్ క్యాన్సిలేషన్ చార్జీలు రద్దు..?
అయితే ఇటీవల అనారోగ్యం కారణంగా సుబ్బానాయుడు ప్రాణాలు కోల్పోయారు. కానీ ఆ సమయంలో కావ్య కృష్ణారెడ్డి నివాళులర్పించేందుకు వెళ్లలేదు. దీనిని సీరియస్ గా తీసుకున్న లోకేష్.. మీకోసం సుబ్బానాయుడు సీటు వదిలేస్తే, ఆయన మరణిస్తే మీరు ఎందుకు వెళ్ళలేదని నిలదీశారు. పద్ధతి మార్చుకోకపోతే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని, నియోజకవర్గంలో విభేదాలు ప్రోత్సహిస్తే మాత్రం జరిగే పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని లోకేష్ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. ఇతర నేతలపై గౌరవంగానీ, క్రమశిక్షణగాని లోపిస్తే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారట లోకేష్. ఇప్పుడు ఈ విషయం టిడిపి వర్గాల్లో సంచలనమైంది. ప్రతి నియోజకవర్గంలో జరిగే వ్యవహారాలను లోకేష్ తెలుసుకుంటున్నారని, ఎవరు ఏ విధంగా మాట్లాడుతున్నారో పూర్తి సమాచారాన్ని తెప్పించుకుని పరిశీలిస్తున్నట్లు టిడిపి వర్గాలు అంటున్నాయి.

