ఏపీలో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కేసీ రెడ్డికి ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. గత కొంతకాలంగా ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఆయనకు న్యాయస్థానం ఉపశమనం కలిగించింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం పాలసీలో భారీగా అక్రమాలు జరిగాయని, ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారని ప్రస్తుత ప్రభుత్వం విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాజ్ కేసీ రెడ్డిని ఏ-1 నిందితుడిగా పేర్కొంటూ అధికారులు అరెస్ట్ చేశారు.
Also Read : బుమ్రా వర్సెస్ వైభవ్.. ఐపిఎల్ లో ఇంట్రస్టింగ్ పోరు..!
లిక్కర్ సిండికేట్ మరియు టెండర్ల ప్రక్రియలో ఆయన కీలక పాత్ర పోషించారనే ఆరోపణలపై సిఐడి విచారణ జరుపుతోంది. రాజ్ కేసీ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై సుదీర్ఘ వాదనలు విన్న హైకోర్టు నేడు తుది తీర్పునిచ్చింది. అయితే, బెయిల్ మంజూరు చేస్తూనే కొన్ని కఠినమైన షరతులను విధించింది. కేసు విచారణలో ఉన్నందున ఎట్టి పరిస్థితుల్లోనూ సాక్షులను బెదిరించడం లేదా ప్రభావితం చేయడం చేయకూడదని కోర్ట్ స్పష్టం చేసింది. దర్యాప్తు సంస్థలు పిలిచినప్పుడు విచారణకు తప్పనిసరిగా హాజరు కావాలని పేర్కొంది.
Also Read : కవితను బుజ్జగించేందుకు రంగంలోకి కీలక వ్యక్తి..?
అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని, పాస్ పోర్టును కోర్టులో డిపాజిట్ చేయాలని ఆదేశించింది. రాజ్ కేసీ రెడ్డికి బెయిల్ రావడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ కుంభకోణంలో మరికొంతమంది కీలక నేతల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న తరుణంలో, ఈ బెయిల్ ఆర్డర్ ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పైకోర్టులో సవాలు చేస్తుందా లేదా అనేది వేచి చూడాలి. ఈ కేసులో మరికొంత మంది జైల్లో ఉన్న సంగతి తెలిసిందే.

