అమరావతి.. ఏపీ రాజధాని అనే కంటే కూడా.. చంద్రబాబు మానసపుత్రిక అంటే సరిగ్గా సరిపోతుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి పనులపై దృష్టి పెట్టారు చంద్రబాబు. ముందు అమరావతిలో క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఆగిపోయిన నిర్మాణాలను పరిశీలించారు. అలాగే కూల్చేసిన ప్రజా వేదికను చూసి ఆవేదనకు గురయ్యారు. అమరావతిని విధ్వంసం చేసేందుకు కుట్రలు చేశారంటూ ఆరోపించారు. తిరిగి పునర్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇందుకోసం అధికారులను పరుగులు పెట్టించారు. 2027 నాటికి అమరావతి తొలి దశ నిర్మాణం పూర్తి చేస్తామని హామీ కూడా ఇచ్చారు. కానీ ప్రస్తుతం పనులు జరుగుతున్న తీరు చూస్తే మాత్రం.. బాబు ఇచ్చిన మాట నిలబెట్టుకునేలా కనిపించటం లేదు.
Also Read : వాట్సాప్ గ్రూపులపై ఫోకస్ పెట్టండి.. సీఎం చంద్రబాబు ఆగ్రహం
ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావొస్తోంది. ఎన్నికల ప్రచారంలోనే అమరావతి నిర్మాణాన్ని పరుగులు పెట్టిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణానికే మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. ప్రభుత్వ భవనాల నిర్మాణాలపై వరుస సమీక్షలు నిర్వహించారు. ఐదేళ్ల క్రితమే పునాదుల స్థాయి దాటిన భవనాల పటిష్ఠతపై నిపుణులతో తనిఖీలు చేయించారు. అలాగే అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు, ఆసియా డెవలప్మెంట్ బ్యాంకులతో ఒప్పందం చేసుకున్నారు. అటు కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతి నిర్మాణానికి పూర్తిస్థాయిలో సహకరిస్తామంటూ హామీ ఇచ్చింది. కేంద్రం గ్యారంటీతో ప్రపంచ బ్యాంకు నిధులు కూడా మంజూరు చేసింది. ఇక అమరావతి బాధ్యతను కూడా మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ, ఏపీ సీఆర్డీఏకు చంద్రబాబు అప్పగించారు.
తొలి రోజుల్లో ఏపీ సీఆర్డీఏ అధికారులు హడావుడి చేశారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ.. అమరావతి అలా ఉంది.. ఇలా ఉంది అంటూ బూస్టింగ్ ఇచ్చారు. కొంతమంది కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా మంత్రి నారాయణతో కలిసి సింగపూర్, మలేషియాలో పర్యటించి.. పెద్ద ఎత్తున పెట్టుబడులు సాధిస్తున్నామని గొప్పలు చెప్పారు. దీంతో.. అమరావతి పనులు నిజంగానే వేగంగా జరుగుతున్నాయని అంతా భావించారు. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన 15 నెలల తర్వాత అసలు నిజం తెలిసింది. ప్రభుత్వం చెబుతున్న దానికి.. అధికారులు చేస్తున్న దానికి ఏ మాత్రం సంబంధం లేదు.70 శాతం పూర్తైన సీఆర్డీఏ రీజనల్ కార్యాలయం భవనం ప్రారంభించడానికే అధికారులు ఏడాది సమయం తీసుకున్నారు. ఇక 2019 నాటికే 80 శాతం పూర్తైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ నిర్మాణాలు ఇప్పటికీ ప్రారంభం కాలేదు.
Also Read : అన్నాడిఎంకేకు శశికళ వెన్నుపోటు..? రంగంలోకి మన్నార్ గుడి మాఫియా..?
ఇక అమరావతికి వెళ్లేందుకు ఇప్పటికీ సరైన మార్గం లేదు. ఇరుకైన కరకట్ట మీదుగా సీఎం క్యాంపు కార్యాలయం మీదుగానే సచివాలయం, హైకోర్టు సిబ్బంది అమరావతి వెళ్తున్నారు. వందల ఎకరాలను ప్రైవేటు సంస్థలకు కేటాయిస్తున్నారు తప్ప.. వాటిల్లో నిర్మాణాలు ప్రారంభం అయ్యాయో లేదో కూడా తెలియదు. ఇక సీఆర్డీఏ అధికారికంగా నిర్వహిస్తున్న @PrajaRajadhani సోషల్ మీడియా అకౌంట్లో అయితే.. పెట్టిన పోస్టులే మళ్లీ మళ్లీ పెడుతున్నారు తప్ప.. అమరావతి నిర్మాణం ఏ దశలో ఉంది.. ఏ భవనం ఎలా ఉందని మాట మాత్రం చూపించడం లేదు. తాజాగా అమరావతి పనుల పురోగతిపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పనులు ఎలా జరుగుతున్న చంద్రబాబు ప్రశ్నకు.. సూపర్ సార్ అని అధికారులు జవాబు చెప్పారు. అలాగే ఓ వీడియో ప్లే చేసి చూపించారు. దీంతో చంద్రబాబు కూడా సరే అనేసి టైమ్ లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. కానీ.. నిజానికి క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులు సీఎంకు తెలియకుండా అధికారులు మేనేజ్ చేశారనే మాట వినిపిస్తోంది. ఇలా అయితే గడువు లోపు ఎలా పూర్తి చేస్తారనే రాజధాని ప్రాంత రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

