గత కొద్ది రోజులుగా ప్రపంచాన్ని వణికిస్తున్న అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలకు ప్రస్తుతానికి తెరపడింది. ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న తరుణంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. రాబోయే రెండు వారాల పాటు ఇరాన్పై ఎటువంటి దాడులు చేయబోమని, యుద్ధానికి తాత్కాలిక విరామం ప్రకటిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో ప్రపంచ దేశాలు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాయి. యుద్ధం ముదురుతున్న తరుణంలో ఇరాన్ ప్రభుత్వం శాంతి దిశగా ఒక అడుగు ముందుకు వేసింది.
Also Read : ఇరాన్ లో ఏం జరుగుతోంది..? అపస్మారక స్థితిలో సుప్రీం లీడర్..?
అమెరికా ముందు 10 పాయింట్లతో కూడిన ఒక ప్రత్యేక ప్రతిపాదనను ఉంచింది. ఈ ప్రతిపాదనల్లో ఉద్రిక్తతలను తగ్గించేందుకు అవసరమైన కీలక అంశాలను ఇరాన్ పొందుపరిచింది. దీనిపై ట్రంప్ స్పందిస్తూ.. ఇరాన్ పంపిన ఆ 10 పాయింట్లపై ప్రస్తుతం తమ బృందం చర్చలు జరుపుతోందని, అందుకే ప్రస్తుతానికి దాడులను ఆపివేస్తున్నామని వివరించారు. ఈ చర్చల్లో అత్యంత ముఖ్యమైన పరిణామం ఏమిటంటే.. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్ అంగీకరించింది.
Also Read : ఏబీఎన్పై వైసీపీ దాడి.. దమ్ముంటే రా అంటూ ఆర్కేకు సవాల్..!
ఇన్నాళ్లూ ఇక్కడ ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయంగా చమురు సరఫరా ఆగిపోయి, ధరలు పెరుగుతాయని భయపడ్డ దేశాలకు ఇది పెద్ద ఉపశమనంగా చెప్పుకోవచ్చు. ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయం చర్చలు సఫలం కావడానికి ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతానికి రెండు వారాల గడువు ఇచ్చినా, ఇరాన్ ప్రతిపాదనలపై అమెరికా సంతృప్తి చెందితే ఈ శాంతి ఒప్పందం మరింత కాలం కొనసాగే అవకాశం ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసే యుద్ధం కంటే, చర్చల ద్వారా సమస్య పరిష్కారం కావడమే మేలని అగ్రరాజ్యం భావిస్తోంది. ఈ 14 రోజుల చర్చల అనంతరం అమెరికా తన తదుపరి కార్యాచరణను ప్రకటించనుంది.

