జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపధ్యంలో.. యుద్ధం దిశగా అడుగులు పడిన సంగతి తెలిసిందే. సరిహద్దుల్లో యుద్ద వాతావరణం తారా స్థాయికి చేరుతున్న తరుణంలో.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. కాల్పుల విరమణకు భారత్ పాకిస్తాన్ దేశాలు అంగీకరించాయని ఆయన ఎక్స్ లో పోస్ట్ చేసారు. భారత్ – పాకిస్తాన్ దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించామనీ, రాత్రంతా రెండు దేశాలతో చర్చలు జరిగాయన్నారు ట్రంప్.
Also Read : ఆదుకోండి ప్లీజ్.. అంతర్జాతీయ సమాజానికి పాక్ విజ్ఞప్తి
ఈ చర్చలు ఫలించినట్లు చెప్పిన ఆయన.. తక్షణమే కాల్పుల విరమణ ఒప్పందానికి రెండు దేశాలు అంగీకరించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా రెండో దేశాలకు ట్రంప్ అభినందనలు తెలిపారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి మిశ్రీ.. కాసేపటి క్రితం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అంగీకరించారు. కాల్పుల విరమణ నేడు సాయంత్రం 5 గంటల నుంచి అమలులోకి వచ్చిందన్నారు. కాల్పుల విరమణకు పాకిస్తాన్ కూడా అంగీకారం తెలిపిందని పేర్కొన్నారు.
Also Read : వారం రోజుల్లో ఐపిఎల్ రీస్టార్ట్..?
ఎల్లుండి రెండు దేశాల మిలటరీ జనరల్స్ మధ్య కీలక సమావేశం జరుగుతుందన్నారు. పాకిస్తాన్ నేడు మధ్యాహ్నం.. భారత్ తో చర్చలు జరిపిందని, కాల్పుల విరమణకు అంగీకారం తెలుపుతున్నామని పేర్కొన్నారు. ఇక పాకిస్తాన్ కూడా దీనిపై కీలక ప్రకటన చేసింది. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో కాల్పుల విరమణపై పోస్ట్ చేసారు. పాకిస్తాన్, భారత్ తక్షణమే కాల్పుల విరమణకు అంగీకరించాయని, పాకిస్తాన్ తన సార్వభౌమాధికారం, దేశ సమగ్రతపై రాజీ పడకుండా ఈ ప్రాంతంలో శాంతి, భద్రత కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని తెలిపారు.