తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ, అధికార ప్రతినిధి దీపక్ రెడ్డి ఇటీవల మీడియాలో చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. సరిగ్గా పది రోజుల క్రితమే ఇండిగో ఎయిర్ లైన్స్ సంక్షోభం సమయంలో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ను కవర్ చేసేందుకు దీపక్ రెడ్డి నోరు జారారు. ఇండిగో సంక్షోభాన్ని పరిష్కరించేందుకు నారా లోకేష్ కూడా తీవ్రంగా కృషి చేస్తున్నాడన్నారు. ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. అసలు కేంద్రం పరిధిలో ఉన్న సమస్యను నారా లోకేష్ ఎలా పరిష్కరిస్తాడంటూ సోషల్ మీడియాలో సెటైర్లు కూడా వేశారు.
Also Read : ఇది కూడా సీబీఐకే..? రేవంత్ సంచలన నిర్ణయం..?
గూనపాటి దీపక్ రెడ్డి.. తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సమీప బంధువు. ఆయన 2021లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో అనంతపురం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం నుండి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2020లో పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై ఏర్పాటు చేసిన సెలెక్ట్ కమిటీలో సభ్యుడిగా కూడా ఉన్నారు. అదే సమయంలో పార్టీ అధికార ప్రతినిధిగా కూడా కొనసాగుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా జాతీయ మీడియాలో టీడీపీ తరఫున తన గొంతు గట్టిగానే వినిపించారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత దీపక్రెడ్డిని రాష్ట్ర ఉపాధి కల్పన, సమాజాభివృద్ధి.. సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ ఇన్ ఏపీ – ఎస్ఈఈడీఏపీ ఛైర్మన్గా 2024 సెప్టెంబరు 24న ప్రభుత్వం నియమించింది.
తాజాగా దీపక్ రెడ్డి ఓ యూ ట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా ఏపీలో ఐఏఎస్ అధికారుల తీరుపై దీపక్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగలు, దరిద్రం చుట్టుకున్నట్టు చుట్టుకున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏమీ రోగం.. నీతులు మాట్లాడుతారు.. డ్రామాలు ఆడుతారు… నా మీద తిరుగుబాటు చేస్తే వాళ్ల చరిత్ర తీస్తా.. దొంగలు ఐఏఎస్ వ్యవస్థలో ఉన్నారంటూ దీపక్ చేసిన వ్యాఖ్యల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తనకు పదవి వచ్చి ఇప్పటికి 14 నెలలు దాటిందని.. అయినా సరే.. తన జీతం సంబంధించిన ఫైల్ ఇప్పటి వరకు క్లియర్ కాలేదన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని సీఎం చంద్రబాబు చెబుతుంటే.. ఐఏఎస్లు మాత్రం కనీసం స్పందించటం లేదన్నారు. చాలా మంది ఐఏఎస్లు గ్రహణం, దరిద్రం చుట్టుకున్నట్లు వ్యవస్థకు చుట్టుకున్నారన్నారు. ఈ పదాలను వారి ముఖం మీదే అంటా అని సవాల్ కూడా విసిరారు.
Also Read : జగన్ కు ఏం దొరకడం లేదా..? అందుకే పాత రాగం..!
ఒక ఫైల్ 14 నెలలు క్లియర్ చేయలేని ఐఏఎస్లు.. ఆ కుర్చీలో కూర్చొవటం అన్ ఫిట్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి.. పిల్లలకు పెళ్లి సంబంధం చూడమని చెప్పారని.. ఒక బడా వ్యాపార వేత్తతో సంబంధం కుదర్చమని కోరినట్లు చెప్పిన దీపక్ రెడ్డి.. ఐఏఎస్, బిజినెస్ కలవదు కదా చెప్పినట్లు తెలిపారు. అయినా పర్లేదు.. కట్నం ఇస్తాను.. వెయ్యి కోట్లు కట్నం ఇస్తానని చెప్పారని.. అలాంటి దొంగలు ఐఏఎస్ వ్యవస్థలో ఉన్నారన్నారు. హైదరాబాద్ ప్రశాసన్ నగర్లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఉండే ఇళ్లు ఒకసారి చూడాలని సూచించారు. అన్ని ఇళ్లు 8, 10 BHK లతో ఉన్నాయన్నారు. వచ్చే జీతం ఎంత.. ఈ 8, 10 BHKలు ఎక్కడి నుంచి వచ్చాయని నిలదీశారు . ఇది వ్యవస్థలో లోపం అని వ్యాఖ్యానించారు. ఈ దరిద్రం సరిచేయకపోతే.. దేశం అంత స్పీడుగా ఎదగదు అని సూచించారు. 2019లో టీడీపీ ఓటమికి ఐఏఎస్, ఐపీఎస్లు ఇచ్చిన తప్పుడు నివేదికలే కారణమన్నారు. 2024లో జగన్ ఓటమికి కూడా ఇదే అధికారుల నివేదిక కారణమన్నారు. వీళ్లు ఇచ్చిన తప్పుడు నివేదికల వల్లే ఇద్దరు ముఖ్యమంత్రులు తీవ్రంగా నష్టపోయారన్నారు.

