ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC)–సీమెన్స్ ప్రాజెక్టుకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఎలాంటి పాత్ర లేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) స్పష్టం చేసింది. ఈ కేసులో ఇతర నిందితులపై విశాఖపట్నంలోని మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) ప్రత్యేక కోర్టులో అదనపు అభియోగ పత్రం దాఖలు చేసిన ఈడీ, మనీలాండరింగ్ లేదా నేరాదాయాల లావాదేవీలతో చంద్రబాబు నాయుడి సంబంధాన్ని సూచించే ఆధారాలు తమ దర్యాప్తులో లభించలేదని పేర్కొంది. అందువల్ల ఆయనను ఈ కేసులో ఎప్పుడూ నిందితుడిగా చేర్చలేదని ఈడీ స్పష్టం చేసింది.
Also Read : చంద్రబాబు ఫిట్నెస్ కు ఫిదా.. వైరల్ అవుతోన్న వీడియో
ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో రాష్ట్రవ్యాప్తంగా 40 స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాల ఏర్పాటు లక్ష్యంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. అయితే, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టుపై వివాదాలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడిని 2023లో అరెస్ట్ చేయగా, ఆయన 53 రోజుల పాటు న్యాయహిరాసత్లో గడిపారు. ఈడీ వివరాల ప్రకారం, ఈ కేసుకు సంబంధించిన ప్రాథమిక నేరంపై ఏపీ సీఐడీ దాఖలు చేసిన ఛార్జ్షీట్ను దర్యాప్తు పూర్తికాలేదనే కారణంతో ట్రయల్ కోర్టు తిరిగి పంపింది.
Also Read : చరిత్ర మర్చిపోతే ఎలా జగన్..!
ఈడీ తన దర్యాప్తులో, స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు నుంచి ఉద్భవించిన నేరాదాయాలతో చంద్రబాబు నాయుడికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టంగా తేల్చింది. “మనీలాండరింగ్ చట్టం కింద నిర్వహించిన దర్యాప్తులో చంద్రబాబు నాయుడి పాత్ర ఏ విధంగానూ వెలుగులోకి రాలేదు. అందుకే గతంలోనూ, ప్రస్తుతం కూడా ఆయనను అభియోగ పత్రాల్లో నిందితుడిగా చేర్చలేదు,” అని ఈడీ పేర్కొంది.

2015లో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సీమెన్స్తో సుమారు రూ.3,300 కోట్ల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం నిధులు అందించగా, మిగిలిన పెట్టుబడిని సీమెన్స్ సమకూర్చాల్సి ఉంది. నిధుల వినియోగంపై సీఐడీ చేసిన ఆరోపణలు న్యాయపరంగా నిలదొక్కుకోలేదని, తాజాగా ఈడీ దర్యాప్తు కూడా స్పష్టం చేసింది. ఈ పరిణామాలతో, ఈ కేసులో చంద్రబాబు నాయుడిపై చేసిన ఆరోపణలకు ఆధారాలు లేవని అధికారికంగా వెల్లడైనట్లైంది.

