ఆంధ్రప్రదేశ్ నకిలీ మద్యం కేసులో ఒక్కో విషయం ఆసక్తిని రేపుతోంది. ఈ కేసులో జోగి రమేష్ సోదరులను అదుపులోకి తీసుకున్న తర్వాత సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఈ కేసులో పోలీసులు చార్జ్ షీట్ దాఖలు చేసారు. జోగి రమేష్ ప్రోద్బలంతోనే జనార్ధనరావు నకిలీ మద్యం తయారీ చేసినట్టు గుర్తించారు. మంత్రిగా ఉన్నప్పుడే జోగి సోదరులకు లంచాలు ఇచ్చేవారని ఛార్జ్ షీట్ లో ఎక్సైజ్ పోలీసులు పేర్కొన్నారు. నకిలీ మద్యం కేసులో విజయవాడ ఎక్సైజ్ కోర్టులో ప్రాథమిక ఛార్జ్ షీట్ చేసారు.
Also Read : పట్టు వీడని మావోలు.. ఎందుకంత ధైర్యం..?
8 మంది నిందితులపై ఛార్జ్ షీట్ దాఖలు చేసారు. ఇబ్రహీంపట్నంలో బయటపడ్డ నకిలీ మద్యం వ్యవహారంపై భవానీపురం ఎక్సైజ్ స్టేషన్లో అక్టోబర్ 6న కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారమే లక్ష్యంగా జోగి రమేష్ నకిలీ మద్యం తయారు చేయించారని ఛార్జ్ షీట్లో ప్రస్తావించారు. అద్దేపల్లి బ్రదర్స్ ప్రతి 3 నెలలకు రూ.3-5 లక్షల ముడుపులు జోగి బ్రదర్స్ కు ముట్టజెప్పేవారని ఛార్జ్ షీట్లో పేర్కొన్నారు. బాల్యం నుంచే రమేష్, జనార్ధనరావు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు గుర్తించామని తెలిపారు.
Also Read : సార్.. నన్ను ఎప్పుడు పూర్తి చేస్తారు..?
అటు ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కూడా చార్జ్ షీట్ దాఖలు చేసారు. తంబళ్లపల్లి కోర్టులో ఈ మేరకు పిటీషన్ దాఖలు చేసారు. 540 పేజీల ఛార్జ్ షీట్లో 33 మంది నిందితుల ప్రమేయం ఉందని ఆధారాలతో కోర్టుకు సమర్పించారు. కేసులో ఇప్పటివరకు 29 మందిని అరెస్టు చేసిన సిట్.. మిగతా నిందితుల అరెస్టు తర్వాత పూర్తిస్థాయి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో జోగి బ్రదర్స్, అద్దేపల్లి బ్రదర్స్ కీలక పాత్రధారులన్న ఎక్సైజ్.. జోగి, అద్దేపల్లి బ్రదర్స్ ను కస్టడీకి కోరుతూ తంబళ్లపల్లె కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు.

