ఇటీవల డ్రగ్స్ పార్టీ కేసులో దొరికిన ఎంపీ పుట్టా మహేష్ వ్యవహారశైలిపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా చంద్రబాబు మాట్లాడుతూ.. పార్టీ గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. బుధవారం తిరుపతి జిల్లా ఎమ్మెల్యేలు, జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రితో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో సీఎం ఈ అంశంపై ఘాటుగా స్పందించారు.
Also Read : త్రిషకు చెన్నైలోనే సీటు..? విజయ్ టూ అమిత్ షా వయా త్రిష..!
ఆ పార్టీలకు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటూ సీఎం సీరియస్ అయ్యారు. డ్రగ్స్ సంస్కృతిపై ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. అసలు డ్రగ్స్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? అటువంటి పార్టీలకు వెళ్లాల్సిన దుస్థితి ఏమొచ్చింది? అని ఆయన ప్రశ్నించారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి, సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన వారు ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ నేపథ్యం ఉన్నా.. క్రమశిక్షణే ముఖ్యం అని స్పష్టం చేసారు.
Also Read : మైలవరం ఎమ్మెల్యే పర్యటనలో రచ్చ రచ్చ..!
పుట్టా మహేష్.. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చాడనే ఉద్దేశంతోనే తగిన గుర్తింపు, అవకాశం ఇచ్చామని సీఎం గుర్తు చేశారు. అయితే, ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తూ పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టేలా వ్యవహరించడం సరికాదని హితవు పలికారు. పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టే వారిని మనం ఎందుకు మోయాలి? అని ప్రశ్నించారు. క్రమశిక్షణా ఉల్లంఘనల విషయంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ రాజీ పడదని చంద్రబాబు స్పష్టం చేశారు. గతంలో కూడా పార్టీ నిబంధనలు అతిక్రమించిన వారిపై ఎటువంటి సంకోచం లేకుండా చర్యలు తీసుకున్నామని, ఇప్పుడు కూడా అదే పంథా కొనసాగుతుందని హెచ్చరించారు. ప్రజాప్రతినిధుల వ్యక్తిగత ప్రవర్తన పార్టీ ప్రతిష్టపై ప్రభావం చూపుతుందని, ప్రతి ఒక్కరూ అత్యంత క్రమశిక్షణతో మెలగాలని ఆదేశించారు. చంద్రబాబు వ్యాఖ్యలతో రాబోయే రోజుల్లో ఈ వ్యవహారంపై పార్టీ పరంగా ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.

