ఒకప్పుడు ఉత్తరాంధ్రలో వైసీపీ ఎంతో బలంగా కనపడేది. రాజకీయంగా 2019 ఎన్నికల్లో టిడిపి ఇబ్బంది పడటంతో వైసిపి తన బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేసింది. ఉమ్మడి విశాఖ జిల్లా మినహా మిగిలిన రెండు జిల్లాల్లో వైసిపి ఒకానొక సమయంలో తన డామినేషన్ కంటిన్యూ చేసింది. శ్రీకాకుళం ఎంపీ గా రామ్మోహన్ నాయుడు విజయం సాధించిన సరే.. ఆ జిల్లాలోని అసెంబ్లీ స్థానాల్లో వైసీపీకి పట్టు ఉండేది. ఇక విజయనగరంలో కూడా దాదాపుగా అటువంటి పరిస్థితులే ఉండేవి. ఈ సమయంలో బొత్స సత్యనారాయణ కుటుంబానికి జిల్లాలో మరోసారి ఆధిపత్యం పెరిగింది.
Also Read : ఆత్మాహుతే.. కారు నడిపిన ఎంబీబీఎస్ డాక్టర్..!
కాంగ్రెస్ లో ఉన్నప్పుడు బొత్స ఈ జిల్లాలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వచ్చారు. 2019 తర్వాత తన బావమరిది మజ్జి శ్రీనును రంగంలోకి దించారు. జిల్లా వైసీపీ పై తన పట్టు సడలకుండా ఉండేందుకు తన తమ్ముడు బొత్సా అప్పల నరసయ్య కూడా పూర్తిస్థాయిలో యాక్టివ్ అయిన పరిస్థితి ఉండేది. అయితే ఇప్పుడు క్రమంగా జిల్లాలో కుటుంబాధిపత్యం తగ్గుతోంది అంటున్నాయి జిల్లా రాజకీయ వర్గాలు. జిల్లాలో చక్రం తిప్పిన బొత్స సత్యనారాయణ.. తన సొంత నియోజకవర్గం చీపురుపల్లి సహా జిల్లా రాజకీయ వ్యవహారాల్లో పెద్దగా తల దూర్చడం లేదు.
Also Read : ఐపిఎల్ లో సంచలన మార్పులు ఇవేనా..?
2019లో అప్పల నరసయ్య గజపతినగరం నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2024 ఎన్నికల్లో ఓటమిపాలైన ఆయన ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. ఇక జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్న చిన్న శ్రీను.. ఇప్పుడు భీమిలి నియోజకవర్గం వైపు చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. విజయనగరం జిల్లాలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు తమకు అనుకూలంగా లేకపోవడంతోనే జిల్లా మారాలని చిన్న శ్రీను భావిస్తున్నట్లు సమాచారం. గతంలో పదేపదే జిల్లాకు వచ్చే ఆయన ఇప్పుడు విశాఖలోనే ఎక్కువగా ఉంటున్నారు. తను ఎవరైనా కలవాలనుకున్న సరే విశాఖ వచ్చి కలవాలని చెప్పినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇక వచ్చే ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ పోటీకి దూరంగా ఉండే అవకాశాలు సైతం కనపడుతున్నాయి.

