హాస్యనటుడు వేణు యెల్దండి ‘బలగం’ చిత్రంతో దర్శకుడిగా మారి తొలి ప్రయత్నంలోనే సంచలన విజయాన్ని అందుకున్నారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తూ ఆయన తెరకెక్కించిన విధానం విమర్శకుల ప్రశంసలతో పాటు అనేక అంతర్జాతీయ అవార్డులను తెచ్చిపెట్టింది. అప్పటి నుండి ఈ ప్రతిభావంతుడైన దర్శకుడి తదుపరి ప్రాజెక్టు పట్ల చిత్ర పరిశ్రమలోనూ, ప్రేక్షకులలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. తన రెండో సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్ను తాజాగా ఆయన ప్రకటించారు. జనవరి 15వ తేదీ సాయంత్రం 4:05 గంటలకు ఈ చిత్ర గ్లింప్స్ను విడుదల చేస్తున్నట్లు ఒక వీడియో ద్వారా వెల్లడించారు. ‘ఎల్లమ్మ’ అనే పేరు ఈ సినిమాకు పరిశీలనలో ఉన్నట్లు సినీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.
Also Read : స్టార్ సినిమా పేరుతో అసభ్యతా? ‘టాక్సిక్’ టీజర్పై పబ్లిక్ ఫైర్
సంక్రాంతి పండుగ వేళ వస్తున్న ఈ ప్రకటన అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ సినిమాలో కథానాయకుడిగా ఎవరు నటిస్తారనే విషయంపై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రంతో వెండితెరకు హీరోగా పరిచయం కాబోతున్నారనే వార్తలు వైరల్ అయ్యాయి. మరికొందరు యంగ్ హీరోల పేర్లు కూడా వినిపించాయి. ఈ ఉత్కంఠకు తెరపడాలంటే అధికారిక గ్లింప్స్ వెలువడే వరకు వేచి చూడాల్సిందే. దిల్ రాజు ప్రొడక్షన్స్ సంస్థ ఈ భారీ ప్రాజెక్టును నిర్మిస్తోంది. గ్రామీణ నేపథ్యం ఉన్న కథలనే వేణు ఎంచుకుంటున్నట్లు సమాచారం. తొలి సినిమాతో బాధ్యతాయుతమైన దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన, రెండో చిత్రంతో తన సత్తాను మరోసారి చాటుకోవాలని చూస్తున్నారు. గ్లింప్స్ ద్వారా ఈ కొత్త సినిమా ఇతివృత్తంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


