అధికార పార్టీల ఎమ్మెల్యేలు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఏ చిన్న పొరపాటు జరిగినా ఆ ప్రభావం ప్రభుత్వాలపై పడుతూ ఉంటుంది. తాజాగా ఈ విషయాన్ని మర్చిపోయారు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. తాజాగా ఎమ్మెల్యే ఇబ్రహీంపట్నం మండలంలోని ఈలాప్రోలులో పర్యటనకు వెళ్ళారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వైఖరి కారణంగా అక్కడి ప్రజలు అసహనం వ్యక్తం చేసారు. జగనన్న కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలపై అక్కడి ప్రజలు నిలదీయగా ఎమ్మెల్యే వైఖరి వివాదాస్పదం అయింది.
Also Read :
కాలనీలో కనీస మౌలిక సదుపాయాలైన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీరు వంటి సౌకర్యాలు లేవని, వర్షాకాలంలో నరకం చూస్తున్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పర్యటన విషయం తెలియగానే, మహిళలు పెద్ద సంఖ్యలో రోడ్డుపైకి వచ్చి ఆయన కాన్వాయ్ ను అడ్డుకున్నారు. ప్రజలు తమ సమస్యలను ఏకరువు పెడుతుంటే, ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ సావధానంగా వినాల్సింది పోయి, వారిపై అసహనం వ్యక్తం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసారు. “మా ఓట్లు వేయించుకున్నప్పుడు లేని ఇబ్బంది.. ఇప్పుడు పనులు అడుగుతుంటే ఎందుకు?” అంటూ మహిళలు ఎమ్మెల్యేను ప్రశ్నించారు.
Also Read :
ప్రజలు ఆవేశంగా మాట్లాడుతుంటే, ఎమ్మెల్యే వారితో వాగ్వాదానికి దిగడం ఆశ్చర్యం కలిగించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు.. రోడ్లు పూర్తి చేయాలని, మురుగునీరు ఇళ్ల ముందు నిలిచిపోవడం వల్ల వ్యాధులు ప్రబలుతున్నాయని, దీనికి శాశ్వత పరిష్కారం కావాలని డిమాండ్ చేయగా ఎమ్మేయే అసహనం వ్యక్తం చేసారు. వేసవి రావడంతో తాగునీటి కొరత ఎక్కువగా ఉందని వాపోయారు. అలాగే వీధి లైట్ ల విషయంలో కూడా ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేయగా.. ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి సమస్యలను వినకుండా కాలనీవాసులపై గొంతు పెంచడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జనం నుంచి వ్యతిరేకత తీవ్రమవ్వడం, మహిళలు వెనక్కి తగ్గేలా కనిపించకపోవడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ తన పర్యటనను అర్థాంతరంగా ముగించుకుని అక్కడి నుండి వెనుదిరిగారు.

