వైసీపీకి విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంతో… ఆయన స్థానంలో ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్గా ఎవరిని నియమిస్తారనే చర్చ.. ప్రస్తుతం ఫ్యాన్ పార్టీలో జోరుగా నడుస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి దెబ్బకు వైసీపీ ఘోర పరాజయం పాలైంది. దీంతో సీనియర్లు అంతా ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. బాలినేని మొదలు… మోపిదేవి, ఆళ్ల నాని, సామినేని ఉదయభాను వంటి నేతలు కూడా జగన్కు గుడ్ బై చెప్పేశారు. తాజాగా విజయసాయిరెడ్డి కూడా జగన్ పార్టీకి రాజీనామా చేశారు. దీంతో వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ పోస్ట్ ఖాళీ అయ్యింది. ఆ పదవిని ఇప్పటి వరకు వైసీపీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి వంటి నేతలే నిర్వహించారు.
Also Read: ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యావు జగన్..?
దీంతో ఉత్తరాంధ్ర నేతలంతా పార్టీ అధినేతపై కాస్త గుర్రుగా ఉన్నారు. దీంతో ఈసారి మాత్రం ఉత్తరాంధ్రకు చెందిన నేతకే ఇవ్వాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొన్నటి ఎన్నికల్లో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ చీపురుపల్లి నుంచి పోటీ చేసి కిమిడి కళా వెంకట్రావు చేతుల్లో ఓడారు. ఆ తర్వాత తన మార్కు రాజకీయంతో ఎమ్మెల్సీ టికెట్ తెచ్చుకుని చట్టసభకు ఎన్నికయ్యారు బొత్స. వాస్తవానికి బొత్స రాజకీయం విచిత్రంగా ఉంటుంది. బొత్స ప్రాభల్యం తగ్గిపోయింది అని అంతా అనుకునే సమయానికి గోడకు కొట్టిన బంతిలా తిరిగి రాజకీయాల్లో పుంజుకోవటం బొత్స స్పెషల్. కాంగ్రెస్ పార్టీలో గురువునే ముంచిన నేతగా గుర్తింపు తెచ్చుకున్న బొత్స… ఏకంగా పీసీసీ అధ్యక్ష హోదాకు చేరుకున్నారు. వైసీపీలో కూడా చేరిన కొద్ది రోజులకే జగన్కు అత్యంత నమ్మకమైన వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
Also Read: అగ్ని ప్రమాదంపై డౌట్స్.. కాలింది అవేనా…?
వైసీపీలో మంత్రి పదవి అనుభవించిన బొత్స… అసెంబ్లీలో పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కనప్పటికీ… మండలిలో మాత్రం ప్రతిపక్ష హోదాతో క్యాబినెట్ ర్యాంగ్ పొందారు. వైసీపీలో బొత్సకు మాత్రమే ప్రస్తుతం కేబినెట్ హోదా ఉంది. బొత్సకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో గట్టి పట్టుంది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నేతలతో చక్కటి సంబంధాలున్నాయి. దీంతో రీజనల్ కో ఆర్డినేటర్ పదవి కోసం గతంలోనే ప్రయత్నాలు చేశారు. అయితే వైవీ సుబ్బారెడ్డిని తప్పించిన జగన్.. ఆయన స్థానంలో విజయసాయిరెడ్డిని నియమించారు. వాస్తవానికి విజయసాయిరెడ్డిపై గతంలోనే విశాఖలో పెద్ద ఎత్తున ఆరోపణలున్నాయి. అయితే అధినేత మాట కాదనలేక సైలెంట్గా ఉండిపోయారు. ఇప్పుడు పార్టీకి సాయిరెడ్డి రాజీనామా చేయడంతో… మరోసారి ఉత్తరాంధ్ర కో ఆర్డినేటర్ పదవిపై చర్చ మొదలైంది.
Also Read: చీరాలలో గ్రూపు రాజకీయాలకు తెరతీసిన మాజీ ఎమ్మెల్యే..!
ఆ పదవి కోసం బొత్స మరోసారి ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. మరోసారి వైవీ సుబ్బారెడ్డి పేరు వినిపిస్తోంది. అయితే ఆయన సారధ్యంలోనే ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యామని… బొత్స అనుచరులు పార్టీ పెద్దలకు చెబుతున్నారు. అలాంటి నేతకు మరోసారి పదవి ఇస్తే… పార్టీ మనుగడ కష్టమంటూ అధిష్ఠానం పెద్దలకు చెప్పినట్లు తెలుస్తోంది. ధర్మాన సోదరుల పేర్లు కూడా పరిశీలించిన పార్టీ పెద్దలు… బొత్స వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్ర పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా బొత్స సత్యనారాయణకే రీజనల్ కో ఆర్డినేటర్ పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. త్వరలోనే ఉత్తరాంధ్ర రీజనల్ కో ఆర్డినేటర్గా బొత్స సత్యనారాయణను నియమిస్తూ ఉత్తర్వులు వస్తాయని అభిమానులు చెబుతున్నారు. అయితే ఫ్యాన్ పార్టీ అధిష్టానం బొత్సని నియమిస్తుందా? లేక మరో నేతను ఉత్తరాంధ్రకు డంప్ చేస్తుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.