ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మీడియాతో సంచలన వ్యాఖ్యలు చేసారు. రిజర్వేషన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరును ఆమె తప్పుబట్టారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికే ఆదర్శమన్నారు షర్మిల. ఇదో చారిత్రాత్మక ఘట్టం. ఈ సర్వే యావత్ భారతావనికి దిక్సూచి అని కొనియాడారు. దేశ భవిష్యత్ కోసం రాహుల్ గాంధీ గారి దూరదృష్టికి ఇదొక నిదర్శనమన్నారు. తెలంగాణ రాష్ట్ర జనాభాలో 56 శాతం బీసీలు, 17 శాతం ఎస్సీలు, 10 శాతం ఎస్టీలు ఉన్నారని… అంటే దాదాపు 90 శాతం వెనుకబడిన, బలహీన వర్గాల ప్రజలే ఉండటం విస్మయపరిచిన అంశమన్నారు.
Also Read : రికార్డ్ పేరుతో బిల్డప్పులు.. ఎవరి కోసం..?
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం… ఏపీలో కూడా ఇదే పరిస్థితి ఉంటుందని నమ్ముతున్నామన్నారు. మన రాష్ట్రంలో కూడా కులగణన చేపట్టాలని డిమాండ్ చేసారు. ఐదున్నర కోట్ల రాష్ట్ర జనాభాలో వెనుకబడిన వర్గాల వారి సంఖ్య తేల్చాలని షర్మిల కోరారు. కుల వివక్షకు గురవుతున్న బలహీన వర్గాల ప్రజలు ఎంతమంది ఉన్నారో లెక్కలు తీయాలని డిమాండ్ చేసిన షర్మిల మనమెంతో మనకంతా అన్నట్లుగా.. రాజకీయ, సామాజిక, విద్యా, ఉద్యోగాలలో వారి వాటా వారికి దక్కాలన్నారు.
Also Read : రఘురామ వ్యాఖ్యలతో.. వైసీపీ నేతల్లో భయం..?
జనాభా ప్రాతిపదికన న్యాయంగా రిజర్వేషన్లు అమలు కావాలని ఆమె అభిప్రాయపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు కులగణన చేపట్టినా.. బీజేపీ దత్తపుత్రుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు ఆ సర్వే వివరాలు తొక్కిపెట్టారని మండిపడ్డారు. బయటకు రాకుండా జాగ్రత్తపడ్డారు. బీజేపీ డైరెక్షన్ లోనే సర్వే రిపోర్టు బయటకు పొక్కకుండా కుట్ర చేశారన్నారు. ఇక దేశ వ్యాప్తంగా కులగణన చేపట్టాలని రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేస్తుంటే.. రిజర్వేషన్లు రద్దుకు కుట్ర అని బీజేపీ తప్పు దారి పట్టిస్తోందన్నారు. బీజేపీ ఉచ్చులో మీరు పడవద్దని.. వెంటనే ఏపీలో కూడా కులగణన చేపట్టాలని.. ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నామని షర్మిల వ్యాఖ్యానించారు.