మాడు పగిలితే కానీ తత్వం బోధ పడినట్లు లేదు.. అనేది నానుడి. నిజమే.. ఈ మాట రాజకీయ నేతలకు బాగా వర్కవుట్ అవుతుంది. ఈ మాట ప్రస్తుతం వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సరిగ్గా సరిపోతుంది కూడా. అధికారంలో ఉన్నప్పుడు.. ఒకలా వ్యవహరించిన జగన్.. ఘోర పరాజయం తర్వాత మాత్రం పూర్తిగా మారిపోయారు. నిన్నటి వరకు ఎవరైనా నా తర్వాతే అని నియంత మాదిరిగా వ్యవహరించిన వైసీపీ అధినేత.. ఇప్పుడు మాత్రం.. నాకు అందరూ కావాలి.. నేను అందరి వాడిని అని జనాల్ని నమ్మించేందుకు నానా పాట్లు పడుతున్నారు.
Also Read : తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తున్న మెడికల్ కాలేజ్ స్కాం
2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున తొలిసారి కడప ఎంపీగా ఎన్నికయ్యారు వైఎస్ జగన్. ఆ తర్వాత తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంతో వారసత్వ రాజకీయాలకు తెర తీశారు. తండ్రి దుర్మరణంతో.. ఖాళీ అయిన ముఖ్యమంత్రి కుర్చీ తనకు కావాలని పట్టుబట్టారు. ఇందుకోసం తండ్రి శవం దగ్గరే తనకు మద్దతుగా ఎమ్మెల్యేల సంతకాలు కూడా తీసుకున్నారనేది జగన్పై ప్రధాన ఆరోపణ. బొత్స, ధర్మాన వంటి సీనియర్ నేతలు కూడా అప్పట్లో ఇదే ఆరోపణలు చేశారు. అయితే నాటి కాంగ్రెస్ పెద్దల సలహాలు, సూచనలు తీసుకున్న పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ.. ముఖ్యమంత్రిగా అనూహ్యంగా సీనియర్ నేత కొణిజేటి రోశయ్య పేరును ప్రకటించారు. ఇది వైఎస్ఆర్ తనయుడిగా జగన్కు ఇబ్బంది అనిపించింది. ఇంకా చెప్పాలంటే.. పరువు పోయినట్లుగా భావించిన జగన్.. కాంగ్రెస్ పార్టీలో ఉన్నన్ని రోజులూ రోశయ్యతో ఎలాంటి సంప్రదింపులు జరపలేదు.
Also Read : మళ్లీ ఎలా గెలుస్తావో నేను చూస్తా..!
వైఎస్ఆర్ మరణం తట్టుకోలేక అభిమానులు పెద్ద ఎత్తున చనిపోయారని.. వారి కుటుంబాలను ఓదార్చే బాధ్యత అని జగన్ ప్రకటించారు. దీనికి నాటి కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాంటి వారిని హైదరాబాద్ పిలిపించి.. ఒక వేదిక ఏర్పాటు చేసి.. వారికి పరిహారం చెక్లు ఇవ్వాలని సూచించారు. ఈ ప్లాన్ వెనుక రోశయ్య సూచన ఉందని అప్పట్లో జగన్ భావించారు. అలా చేస్తే.. కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది కానీ.. తనకు ఎలాంటి గుర్తింపు రాదనుకున్నారు. అందుకే ఓదార్పు యాత్ర చేసి తీరుతా అని నాటి ఢిల్లీ పెద్దలకు అల్టిమేటం జారీ చేశారు. దీంతో జగన్పైన కాంగ్రెస్ పెద్దలు క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. ఇక ఏడాది తర్వాత తన సీఎం పదవికి రోశయ్య రాజీనామా చేయడంతో.. ఆయన స్థానంలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్ఠానం సీఎం చేసింది.
Also Read : నిన్ను కొట్టనురా.. వచ్చి కలువురా.. లారెన్స్ ఎమోషనల్
ఆనాటి నుంచి రోశయ్య పేరును జగన్ ఒక్కసారి కూడా ప్రస్తావించలేదు. జగన్ అధికారంలో ఉన్న సమయంలో 2021 డిసెంబర్ 4వ తేదీన రోశయ్య మృతి చెందారు. రోశయ్యకు వైఎస్ఆర్కు మధ్య చక్కని అనుబంధం ఉందనే విషయం అందరికీ తెలుసు. వైఎస్ఆర్ మృతి చెందారనే విషయం ప్రకటించే సమయంలో రోశయ్య కన్నీరు కూడా పెట్టుకున్నారు. అలాంటి రోశయ్య మృతి చెందినప్పుడు జగన్ కనీసం సంతాపం కూడా చెప్పలేదు. జగన్ హైదరాబాద్ వెళ్లి రోశయ్యకు నివాళి అర్పిస్తారని అంతా అప్పట్లో అనుకున్నప్పటికీ అలా జరగలేదు. దీంతో జగన్కు సీఎం పదవి రాకుండా రోశయ్య అడ్డుకున్నందుకే ఇంత కోపం పెట్టుకున్నారని అప్పట్లో వైసీపీ నేతలే వ్యాఖ్యానించారు.
Also Read : గిల్ పై విషం కక్కుతున్న పాక్, బంగ్లా క్రికెట్ ఫ్యాన్స్
ఆ తర్వాత రోశయ్య జయంతి, వర్దంతి సందర్భంగా ఒక్కసారి కూడా జగన్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ ఎన్నికల్లో ఓడిన తర్వాత జగన్ రియలైజ్ అయ్యారనే మాట వినిపిస్తోంది. రోశయ్య 91వ జయంతి సందర్భాంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు జగన్. “ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, సుదీర్ఘకాలం ఆర్థిక శాఖ మంత్రిగా కొణిజేటి రోశయ్య గారు రాష్ట్రానికి అందించిన సేవలు చిరస్మరణీయం. నేడు రోశయ్యగారి జయంతి సందర్భంగా నివాళులు.” అంటూ వైఎస్ఆర్తో రోశయ్య ఉన్న ఫోటో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ పై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చనిపోయినప్పుడు ఎందుకు నివాళి అర్పించలేదని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు అయితే.. ఆర్యవైశ్య ఓట్ల కోసమే ఇలా ఇప్పుడు నివాళులు అర్పిస్తున్నారా అని కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా… అంతా నా ఇష్టం అనేలా వ్యవహరించిన జగన్.. ఓడిన తర్వాత మాత్రం.. అంతా నా వాళ్లే అన్నట్లు వ్యవహరిస్తున్నారు.