వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి భారీ ర్యాలీకి శ్రీకారం చుట్టారు. మిర్చి, పొగాకు, మామిడి రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలంటూ గుంటూరు, పొదిలి, బంగారుపాళ్యంలో పర్యటించారు జగన్. ఆ తర్వాత సత్తెనపల్లిలో ఓదార్పు యాత్ర చేసినప్పటికీ.. జగన్ వాహనం కింద ఓ కార్యకర్త పడి చనిపోవడంతో.. మళ్లీ బయటకు వచ్చిందే లేదు. జిల్లాల పర్యటనలకు రెడీ అని చెప్పినప్పటికీ.. వాయిదా వేస్తూనే ఉన్నారు.
Also Read : ఆ ముగ్గురినీ వేటాడుతున్న బోర్డు..?
ఏపీలో వైసీపీ ఓడిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజల్లోకి వచ్చిన సందర్భాలు వేళ్లమీద లెక్కబెట్టే స్థాయిలోనే ఉన్నాయి. ప్రజా సమస్యలపై ఆయన మాట్లాడిందే లేదు. ఇక అసెంబ్లీకి ఏ మాత్రం రాలేదు. పైగా ప్రతిపక్ష హోదా కావాలని హైకోర్టులో కేసులు కూడా వేశారు. బెంగళూరు యలహంక ప్యాలెస్ నుంచి తాడేపల్లి వచ్చి పోతున్నారు తప్ప.. ప్రజలతో నేరుగా మాట్లాడిన సందర్భాలు లేవు. అయితే మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు జగన్. దీనిపై ఇప్పుడు క్షేత్రస్థాయి పర్యటనకు జగన్ సిద్ధమయ్యారు.
జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలోనే మెడికల్ కాలేజీ ఉంది. ఈ కాలేజీపై కూడా టీడీపీ నేతలు విమర్శలు చేశారు. కానీ జగన్ మాత్రం తన పర్యటనను సొంత నియోజకవర్గం నుంచి కాకుండా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి మొదలుపెట్టనున్నట్లు వెల్లడించారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఈ నెల 9న జగన్ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో స్టీల్ ప్లాంట్, షుగర్ ఫ్యాక్టరీ, బల్క్ డ్రగ్ బాధితులను కూడా జగన్ కలవనున్నట్లు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు.
Also Read : కూటమి.. నిజంగానే ఇది మంచి ప్రభుత్వం..!
మెడికల్ కాలేజీల పర్యటన నర్సీపట్నం నుంచి ప్రారంభించనున్నారు. ఇందుకు ప్రధాన కారణం.. ఇటీవల స్పీకర్ అయ్యన్న పాత్రుడు జగన్ పై చేసిన వ్యాఖ్యలే అని తెలుస్తోంది. అసెంబ్లీకి వైసీపీ నేతలు దూరంగా ఉన్న నేపథ్యంలో స్పీకర్ స్థానంలో ఉన్న అయ్యన్న పాత్రుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే సభకు రావాలంటూ అయ్యన్న సవాల్ విసిరారు. అదే సమయంలో నర్సీపట్నంలో నిర్వహించిన బహిరంగ సభలో.. తనపై వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని అయ్యన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా. నర్సీపట్నం మెడికల్ కాలేజీపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ కూడా విసిరారు. అందుకే జగన్ కూడా అయ్యన్నకు ధీటుగా జవాబు ఇచ్చేందుకు నర్సీపట్నం మెడికల్ కాలేజీ సందర్శన చేపట్టారు.
ఇక పాయకరావుపేట నియోజకవర్గంలో ఏర్పాటు చేయనున్న బల్క్ డ్రగ్ పరిశ్రమను మత్స్యకారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయంలో జాతీయ రహదారిపై ధర్నాలు కూడా చేపట్టారు. ఒక దశలో హోమ్ మంత్రి అనితను కూడా నడిరోడ్డుపై నిలదీశారు. అనితకు వ్యతిరేకంగా నినాదాలు చేసి ఆందోళన కూడా చేపట్టారు. అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కూటమి నేతలు స్పష్టమైన ప్రకటన చేయటం లేదని.. కార్మికులను మోసం చేస్తున్నారని ఆరోపిస్తున్న జగన్.. కార్మికులు చేస్తున్న ఆందోళనకు సంఘీభావం తెలియజేయనున్నారు.
Also Read : గవాయ్ పై షూ ఎందుకు విసిరినట్టు..? కారణం అదేనా..?
ప్రతిపక్షంలో ఉన్న నాటి నుంచి జగన్ పైన అనిత ఘాటు వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పులివెందుల ఎమ్మెల్యే అని, సైకో అంటూ జగన్ను ఉద్దేశించి అనిత తీవ్ర విమర్శలు కూడా చేశారు. అనిత తీరుపై జగన్తో పాటు వైసీపీ నేతలు కూడా గుర్రుగానే ఉన్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైసీపీ నేతలు, కార్యకర్తలపై పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని.. దీని వెనుక అనిత ఉన్నారనేది వైసీపీ నేతల ఆరోపణ. జగన్ను అనిత మాజీ ముఖ్యమంత్రిగా గుర్తించటం లేదని.. అసెంబ్లీలో కూడా కనీస గౌరవం ఇవ్వటం లేదని గుర్రుగా ఉన్నారు. దీంతో అనితకు అడ్డుకోవాలంటే నేరుగా జగన్ రంగంలోకి దిగాలని సూచించారు కూడా.
నర్సీపట్నం మెడికల్ కాలేజీ సందర్శన ద్వారా అయ్యన్నకు, బల్క్ డ్రగ్ బాధితులను పరామర్శించడం ద్వారా అనిత దూకుడుకు బ్రేకులు వేయాలనేది వైసీపీ నేతల ప్లాన్. సాధారణంగా జగన్ పర్యటన అంటే వైసీపీ అభిమానులు పెద్ద ఎత్తున వస్తారనేది ఆ పార్టీ నేతల భావన. ఈ నెల 9న జగన్ పర్యటన నేపథ్యంలో నేతలు, కార్యకర్తలతో సమావేశమైన గుడివాడ అమర్నాథ్.. 7 నియోజకవర్గాల్లో జగన్ రోడ్ షో ఉంటుందని.. ఇందులో కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆదేశించారు. ఇతర జిల్లాల నుంచి కూడా వైసీపీ కార్యకర్తలను నేతలు తీసుకురావాలని సూచించారు. ఉత్తరాంధ్రలో జగన్ బలం తగ్గలేదని.. అలాగే అయ్యన్న పాత్రుడు, అనితపై ప్రజలు గుర్రుగా ఉన్నారనే అభిప్రాయం ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది వైసీపీ నేతల ప్లాన్. మరి ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి.