ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి దగ్గర నుంచి వైసీపీకి అనేక ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. పార్టీ నుంచి పెద్ద ఎత్తున నాయకులు ఇతర పార్టీలలోకి వలస వెళుతున్నారు. ఈ వలసల పరంపర కొనసాగుతూనే ఉంది .ఇక క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి ఆందోళనకరంగా ఉండడం, పార్టీ క్యాడర్ ను ముందుకు నడిపించే నాయకులు పెద్దగా కనిపించకపోవడంతో, పార్టీని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని జగన్ ఎప్పటి నుంచో భావిస్తున్నారు. ముఖ్యంగా అధికార కూటమి పార్టీలైన టిడిపి, జనసేన బిజెపి లకు దీటుగా వైసీపీని బలోపేతం చేసి వచ్చే ఎన్నికల నాటికి బలం పుంజుకుని మళ్లీ అధికారంలోకి రావాలనే పట్టుదలతో జగన్ ఉన్నారు. దీనిలో భాగంగానే క్షేత్రస్థాయి నుంచి ప్రక్షాళన మొదలుపెట్టారు.
దీనిలో భాగంగానే జిల్లా అధ్యక్షులు మార్పుతో సహా రాష్ట్ర స్థాయి పదవులలోనూ మార్పులు, చేర్పులు చేపట్టారు. దీనిలో భాగంగానే మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డికి జగన్ ప్రమోషన్ ఇచ్చారు. ఆయనను వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జగన్ నియమించారు. అలాగే జగన్ కు సలహాదారుగా ఆళ్ల మోహన్ సాయి దత్ ని నియమించారు. అలాగే పెనమలూరు కు చెందిన వేణుగోపాల్ కృష్ణమూర్తిని రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. దీంతో పాటు వైసీపీలోని 41 అనుబంధ విభాగాలకు అధ్యక్షులను కూడా నియమిస్తూ జగన్ ప్రకటన విడుదల చేశారు.
Read Also : మోక్షజ్ఞ సినిమా వెనుక ఇంత ప్లానింగ్ ఉందా?
కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఎస్సీ మోహన్ రెడ్డిని నియమించారు. నంద్యాల జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డిని నియమిస్తూ మరో ప్రకటన జగన్ విడుదల చేశారు. ఇక పూర్తిస్థాయిలో వైసీపీలో ప్రక్షాళన మొదలుపెట్టి పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడుతున్న వారు, అంకితభావంతో పనిచేసే వారికి కీలక పదవులను అప్పగించి, పార్టీని బలోపేతం చేయాలనే దిశగా జగన్ ఆలోచన చేస్తున్నారు.
మొన్నటి ఎన్నికల్లో క్షేత్రస్థాయి పరిస్థితులను సరిగా అంచనా వేయకపోవడంతోనే ఘోరంగా ఎన్నికల ఫలితాలు నిలబడ్డాయి అనే విషయాన్ని గ్రహించిన జగన్, మరోసారి ఆ పరిస్థితి తలెత్తకుండా క్షేత్రస్థాయి నుంచి పార్టీ పదవులను ఎవరికి అప్పగించాలనే దానిపైన ఒక నివేదిక తెప్పించుకుని దానికి అనుగుణంగా మార్పు చేర్పులకు శ్రీకారం చుడుతున్నారు. మరి ఈ మార్పులు, చేర్పులు పార్టీ భవిష్యత్తుని ఏమన్నా మారుస్తుందేమో చూడాలి. వైసీపీ తిరిగి పుంజుకునే అవకాశం చంద్రబాబు కల్పిస్తారో లేదో కూడా చూడాల్సి ఉంది.

