జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు సమయం దగ్గర పడుతున్న కొద్ది రాజకీయం ఆసక్తిని కలిగిస్తోంది. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ పోటీ చేస్తుండగా, బిజెపి నుంచి లంకల దీపక్ రెడ్డి, భారత రాష్ట్ర సమితి నుంచి మాగంటి సునీత పోటీలో ఉన్నారు. ఎన్నికల్లో ముస్లిం సామాజిక వర్గ ఓట్ల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలవాలని పట్టుదలగా ఉన్న కాంగ్రెస్ పార్టీ.. ఉన్న అన్ని అవకాశాలను వాడుకునే ప్రయత్నం చేస్తుంది. నియోజకవర్గంలో ముస్లిం ఓటు బ్యాంకు ఎక్కువగా ఉండటంతో.. ఎంఐఎం మద్దతు కోరింది.
Also Read : జక్కన్న క్రేజీ ప్లాన్.. రామోజీ ఫిలిం సిటీలో గ్రాండ్ ఈవెంట్
ఇప్పటికే ఎంఐఎం కూడా ఈ ఎన్నికల్లో పోటీ పెట్టకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చింది. ఇక అజారుద్దీన్ గత ఎన్నికల్లో పోటీ చేయగా.. ఈసారి ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిని చేసేందుకు సిద్ధమైంది. గతంలో నవీన్ యాదవ్ ఎంఐఎం తరపున పోటీ చేయడంతో ఆయనకు నియోజకవర్గంలో ముస్లిం సామాజిక వర్గంలో మంచి పట్టు ఉంది. ఇక అజరుద్దీన్ కు ఉన్న ఇమేజ్ కూడా కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో.. ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. మంత్రివర్గంలో ఇంకా మూడు బెర్తులు ఖాళీగా ఉన్న సంగతి తెలిసిందే.
Also Read : జయలలితను గుర్తు చేస్తున్న కవిత.. న్యూ పొలిటికల్ లుక్
అందులో ఒక స్థానానికి అజరుద్దీన్ శుక్రవారం ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందని భావించారు. కానీ ఈ విషయంలో బిజెపి అడ్డుపడే అవకాశాలు కనబడుతున్నాయి. తాజాగా ఎన్నికల సంఘాన్ని కలిసిన బిజెపి నేతలు.. ఎన్నికల ఉల్లంఘనకు వస్తుందని, మంత్రి వర్గ విస్తరణ చేయవద్దని కోరారు. అయితే దీనిపై ఎన్నికల సంఘం ఏ నిర్ణయం తీసుకుంటుందా అనేది ఆసక్తిగా మారింది. అయితే మంత్రివర్గ విస్తరణ అనేది ఎన్నికల సంఘం పరిధిలోకి రాదు కాబట్టి ఈ విషయంలో పెద్దగా జోక్యం చేసుకునే అవకాశం ఉండకపోవచ్చు. అవసరమైతే ఈ విషయంలో కోర్టుకు వెళ్లేందుకు కూడా బిజెపి సిద్ధమవుతున్న నేపథ్యంలో పరిణామాలు ఆసక్తిని రేపుతున్నాయి.

