పదేళ్ల పాటు అధికారంలో కొనసాగిన పార్టీ.. హ్యాట్రిక్ కొడతామని గొప్పగా ప్రకటించారు. కానీ ప్రతిపక్షానికే పరిమితమయ్యారు. ఉద్యమ పార్టీగా అవతరించిన తెలంగాణ రాష్ట్ర సమితి ఆ తర్వాత పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మారిపోయింది. ఏప్రిల్ 27వ తేదీతో ప్రస్తుత భారతీయ రాష్ట్ర సమితి సరిగ్గా 25 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. టీఆర్ఎస్ ప్రారంభించినప్పుడు ప్రత్యేక తెలంగాణ సాధనే ఏకైక లక్ష్యమంటూ పిలుపిచ్చారు పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్. ఆ తర్వాత తెలంగాణ సాధన కోసం పలు రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. చివరికి 2014లో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తర్వాత వరుసగా రెండుసార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు కేసీఆర్. పార్టీ స్థాపించి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల ఏప్రిల్ 27వ తేదీన వరంగల్లో రజతోత్సవ సభను నిర్వహించేందుకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు గులాబీ పార్టీ నేతలు.
Also Read : బెజవాడ జైల్లో వీఐపీ సందడి.. వంశీ టూ పీఎస్ఆర్
పార్టీ ప్రారంభం నాటి నుంచి ప్రజల భావోద్వేగాలే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రయాణం కొనసాగింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం అన్ని వర్గాల ప్రజలను ఉత్తేజ పరిచేలా ప్రసంగాలు చేశారు కేసీఆర్. 2014లో తొలిసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. అనూహ్యంగా ప్రభుత్వానికి పది నెలల గడువు ముందే అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో రెండోసారి గెలిచారు. అయితే 2023 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. ఆ తర్వాత 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు కనీసం డిపాజిట్లు కూడా రాలేదు. కొన్ని చోట్ల సరైన అభ్యర్థులు కూడా పోటీలో లేని దుస్థితి బీఆర్ఎస్ది. దీంతో 24 ఏళ్ల చరిత్ర కలిగిన బీఆర్ఎస్ పరిస్థితి దయనీయంగా మారిందని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఒకదశలో అధినేత కేసీఆర్ తీరుపైన పార్టీ నేతలే నేరుగా ఆరోపణలు చేశారు.
Also Read : అవును చెత్త పనులు చేస్తున్నాం: పాక్ సంచలన వ్యాఖ్యలు
అయితే ఏడాది కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టిగానే నిలదీస్తున్న బీఆర్ఎస్.. ఈ నెల 27వ తేదీన జరగనున్న పార్టీ రజతోత్సవ సభను సూపర్ సక్సెస్ చేయాలని గట్టి పట్టుదలతో ఉంది. మరో రెండు నెలల్లో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉంది. దీంతో పార్టీ పునర్నిర్మాణంతో పాటు కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తులపై కూడా బీఆర్ఎస్ అగ్రనేతలు దృష్టి పెట్టారు. తెలంగాణలో రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తైనప్పటికీ.. ఇప్పటికీ పూర్తిస్థాయిలో నాయకులకు పదవులు దక్కలేదు. అదే సమయంలో 13 మంది బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో వీరి చేతిలో ఓడిన నేతలంతా ఇప్పుడు కాంగ్రెస్ పెద్దల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో పాత, కొత్త నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ప్రస్తుతం ఇలాంటి నేతలపైనే బీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ రజతోత్సవ సభలో ఇలాంటి వారికి గులాబీ జెండా కప్పి.. కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వాలని చూస్తోంది. ఇలా చేయడం వల్ల స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి షాక్ వస్తుందనేది బీఆర్ఎస్ ప్లాన్. మరి వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి.

