తెలుగుదేశం పార్టీ అధిష్టానం కార్యకర్తల ఎమోషన్స్ కి ఏ మాత్రం విలువనివ్వడం లేదనే విషయం కొన్ని సందర్భాల్లో అర్ధమవుతూ ఉంటుంది అంటారు ఆ పార్టీ కార్యకర్తలు. దెబ్బలు తిన్నాం, జైలుకి వెళ్లి వచ్చాం, నానా కష్టాలు పెట్టారు, పడ్డాం… అయినా సరే మా బాధకు విలువ లేదా అంటూ కొందరు సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేయడం మనం చూస్తూనే ఉన్నాం. రాజకీయంగా పార్టీ బలహీనంగా ఉన్నప్పుడు మేము బలంగా నిలబడ్డాం.. పార్టీ బలంగా ఉన్నప్పుడు మమ్మల్ని ఎందుకు బలహీన పరుస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో అధిష్టానం పైనే నేరుగా విమర్శలు ఎక్కుపెడుతున్నారు కార్యకర్తలు.
ఆంధ్రప్రదేశ్ లో గత జగన్ ప్రభుత్వం రాజకీయంగా మరియు పరిపాలనా పరంగా ఎలాంటి తప్పుడు నిర్ణయం తీసుకున్నా అన్ని విధాలుగా ఆ పార్టీ కార్యకర్తలు సపోర్ట్ చేసే వారు. వాళ్ళు ఏదైనా సోషల్ మీడియాలో పెడితే దాని గురించి వెంటనే ఉత్తర్వులు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాని ఇప్పుడు మాత్రం జరిగిన తప్పుల పై దృష్టి పెట్టి సరి చేయండని కోరుతున్నా టిడిపి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో పట్టించుకునే నాధుడే కనపడటం లేదని కార్యకర్తలు మండిపడుతున్నారు.
Read Also : అమరావతి పై దుష్ప్రచారానికి చేతులు కలిపిన వైసీపీ, బిఆర్ఎస్
విజయవాడ లో ఉన్న ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరుని అప్పుడు వైఎస్సార్ యూనివర్సిటీగా మారుస్తూ వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. దీనిని ఆ పార్టీ కార్యకర్తలు స్వాగతించారు. ఆ తర్వాత చంద్రబాబు స్పందించి అధికారంలోకి రాగానే పేరు మారుస్తాం అంటూ హామీ ఇచ్చారు. చెప్పినట్టుగానే మార్చేసారు కూడా. అక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఎన్టీఆర్ యూనివర్సిటీలో మారాల్సిన చోట ఎన్టీఆర్ పేరు ఇంకా మారలేదు. యూనివర్సిటీతో ఏ మాత్రం సంబంధం లేని వైఎస్ విగ్రహం అక్కడ అలానే ఉంది.
వైఎస్ఆర్ పేరు ఉన్న శిలాఫలకం టీడీపీ కార్యకర్తలు గెలిచిన కొత్తలో పగులగొట్టారు అంతే. వైఎస్సార్ పేరుని కార్యకర్తలు తీసి ఎన్టీఆర్ పేరు పెట్టడమే తప్ప, ప్రభుత్వం గాని యూనివర్సిటీ అధికారులు గాని ఇప్పటివరకు మార్చలేదు. అసెంబ్లీలో బిల్ అయితే పాస్ అయింది.. మంత్రి మండలిలో తీర్మానం చేసారు అంతే. జీఓ కూడా ఇచ్చినా కూడా దానిని అధికారులు పట్టించుకున్న పరిస్థితి కనపడటం లేదు. అధికారుల పై ప్రభుత్వానికి ఇంకా పట్టు రాకపోవడం ఆశ్చర్యం. ఇలాంటి సమయాల్లోనే ప్రభుత్వాల చిత్తశుద్ధిని శంకించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇదేనా ఈ ప్రభుత్వానికి ఎన్టీఆర్ పైన ఉన్న గౌరవం అంటూ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

