తిరుమల బ్రహ్మోత్సవాలు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి అత్యంత వైభవంగా, శాస్త్రోక్తంగా నిర్వహించే వార్షిక ఉత్సవాలు. ఇవి తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతాయి. తిరుమలలో సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2వ తేది వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ప్రణాళికలు రూపొందించి నిర్దేశిత సమయంలోపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి విభాగాధిపతులను ఆదేశించారు.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలపై తిరుమలలోని అన్నమయ్య భవన్లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చేపట్టబోయే ఏర్పాట్లపై విభాగాల వారీగా సమీక్షించి పలు సూచనలు చేశారు. సెప్టెంబర్ 16వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు తిరుమలలో బ్రహ్మోత్సవాల సందడి ఉంటుందన్నారు. సెప్టెంబర్ 23వ తేదీన బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగుతుందని.. అక్టోబర్ 2వ తేదీన చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం అవుతాయన్నారు. బ్రహ్మోత్సవాలకు ముందు వచ్చే మంగళవారం రోజున కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఈ ఏడాది సెప్టెంబర్ 16వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆ రోజున వీఐపీ బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. ఉదయం 11 గంటల వరకు సుగంధ ద్రవ్యాలతో శ్రీవారి ఆలయాన్ని పూర్తిగా శుద్ధి చేస్తామని.. అప్పటి వరకు భక్తులకు దర్శనానికి అనుమతి లేదన్నారు.
Also Read : కొత్త నిబంధనలతో యూట్యూబర్లకు షాక్.. మానిటైజేషన్ మరింత కఠినం
సెప్టెంబరర్ 23వ తేదీన శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగనుంది. ఆగమ శాస్త్రానుసారం ముక్కోటి దేవతలకు ఆహ్వానం పంపిస్తారు. 24వ తేదీన ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయి. ప్రతి రోజు ఉదయం ఒక వాహనంపైన, సాయంత్రం మరో వాహనంపైన మలయప్ప స్వామి తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. ఇక బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రముఖమైన గరుడ వాహన సేవ సెప్టెంబర్ 28వ తేదీన జరగనుంది. ఆ రోజు సుమారు 4 లక్షల మంది స్వామి వారి వాహన సేవను దర్శించుకునేలా గ్యాలరీల్లో ఏర్పాట్లు చేయాలని వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, అన్న ప్రసాదాలు అందించాలని సూచించారు. అక్టోబర్ 1వ తేదీన రథోత్సవం, 2వ తేదీన చక్రస్నానంతో సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
16-09-2025 కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.
23-09-2025 శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.
24-09-2025 ధ్వజారోహణం.
28-09-2025 గరుడ వాహనం.
01-10-2025 రథోత్సవం.
02-10-2025 చక్రస్నానం.
ప్రతిరోజూ ఉదయం 8 నుండి 10 గంటల వరకు, సాయంత్రం 7 నుండి 9 గంటల వరకు వాహన సేవలు ఉంటాయని వెంకయ్య చౌదరి తెలిపారు. బ్రహ్మోత్సవ రోజుల్లో భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకుని ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేశారు. వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులు, ఎన్ఆర్ఐ, దాతల దర్శనాలు కూడా రద్దు చేస్తున్నట్లు వెంకయ్య చౌదరి తెలిపారు. విజిలెన్స్, పోలీసు విభాగాల సమన్వయంతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి, రోడ్ మ్యాప్ లు, పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు దర్శన క్యూలైన్లు, మాడ వీధుల్లోని గ్యాలరీలు, ముఖ్యమైన ప్రాంతాల్లో విరివిగా అన్న ప్రసాదాలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. భక్తుల అవసరాలకనుగుణంగా ఇంజనీరింగ్ పనులు చేపట్టాలన్నారు.
Also Read : ప్రపంచ వ్యాప్తంగా ఈ ఆకుకూర కోసం ఎందుకంత డిమాండ్?
గ్యాలరీల్లో భక్తులకు సమస్యలు తలెత్తకుండా మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచేందుకు అదనపు సిబ్బందిని తీసుకోవాలన్నారు. భక్తులను ఆకట్టుకునే విధంగా విద్యుత్ అలంకరణలు, ఫల, పుష్ప ప్రదర్శన ఏర్పాటు చేయాలని ఆదేశించారు. శ్రీవారి సేవకులుగా యువతీ, యువకులను ఆహ్వానించి భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలన్నారు. 27-09-2025 రాత్రి 9 నుండి 29-09-2025 ఉదయం 6 గంటల వరకు తిరుమల ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాలకు అనుమతి లేదన్నారు. భక్తుల రద్దీకి తగినవిధంగా లడ్డూలు నిల్వ ఉంచుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నిర్దేశిత సమయంలోపు ఏర్పాట్లు పూర్తి చేయాలని అదనపు ఈవో వెంకయ్య చౌదరి సూచించారు.