ఏపీలో జెట్ స్పీడుతో దూసుకెళ్తున్న తెలుగుదేశం పార్టీని క్రమంగా తెలంగాణలో విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. 2014 ఎన్నికల వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. అయితే తెలంగాణ ఉద్యమం తర్వాత చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం తెలంగాణలో టీడీపీపై నెగిటివ్ ప్రచారానికి కారణమైంది. అదే సమయంలో ఏపీ పైనే చంద్రబాబు ఎక్కువగా ఫోకస్ పెట్టడంతో కీలక నేతలంతా క్రమంగా టీడీపీకి దూరమయ్యారు. దీంతో పార్టీని ముందుకు నడిపించే నేత కరువయ్యాడు.
Also Read : జనసేన… రాజకీయ పునరావాస కేంద్రం…!
అయితే ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత తెలంగాణలో కూడా పార్టీ బలోపేతంపై చంద్రబాబు దృష్టి పెట్టారు. తరచూ హైదరాబాద్ రావడంతో పాటు ఎన్టీఆర్ భవన్లో పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నారు కూడా. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలో అత్యధికంగా తెలంగాణ వారికే అవకాశం ఇచ్చారు. ఇక పార్టీ సభ్యత్వ నమోదులో ఇప్పటికే తెలంగాణలో 50 లక్షల మార్కు దాటేసింది. ఇక కీలక నేతలు ఇప్పటికే చంద్రబాబుతో భేటీ అయ్యారు కూడా. వారిలో ముందుగా మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి పసుపు కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది.
గతంలో మహేశ్వరం ఎమ్మెల్యేగా పని చేసిన తీగల కృష్ణారెడ్డి… బీఆర్ఎస్లో సరైన గుర్తింపు రాకపోవడంతో… కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం జిల్లా పరిషత్ ఛైర్పర్సన్గా ఉన్న కృష్ణారెడ్డి కోడలు అనితారెడ్డికి హస్తం పార్టీలో ఆశించిన గుర్తింపు రావడం లేదు. కాంగ్రెస్లో ఎక్కువ కాలం మనుగడ సాగించలేమని గ్రహించిన తీగల కృష్ణారెడ్డి… తిరిగి సొంత గూటికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా బీఆర్ఎస్లో ఉన్న తలసాని, మల్లారెడ్డి, ఎల్ రమణ వంటి నేతలు తిరిగి ఘర్ వాపసీ రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
Also Read : ఏపిలో మందుబాబులకు గుడ్ న్యూస్
అలాగే త్వరలోనే మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్రావు కూడా టీడీపీ గూటికి చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అందరి కంటే ముందే తాను వెళితే… గుర్తింపు లభిస్తుందనేది తీగల భావన. అందుకే డిసెంబర్ 3వ తేదీన తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ముహుర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. తీగల పార్టీలో చేరిన వెంటనే… తెలంగాణ అధ్యక్ష పగ్గాలు ఇచ్చేందుకు చంద్రబాబు హామీ ఇచ్చినట్లు సమాచారం. తీగల చేరిక తర్వాత బీఆర్ఎస్లో ఉన్న టీడీపీ మాజీలను కూడా తిరిగి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

