తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటింది. రాష్ట్ర ప్రజలకు ఇందిరమ్మ పాలన అందిస్తున్నామని, ప్రజాపాలన అమలవుతోందని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. మంత్రులకు పూర్తి స్వేచ్ఛ ఉందని సీఎం రేవంత్రెడ్డి సైతం పదేపదే అంటున్నారు. అయితే మంత్రుల పరిస్థితి మాత్రం ఇబ్బందిగా ఉన్నట్లు సమాచారం. పలువురు మంత్రులు కొంతకాలంగా ప్రభుత్వ పెద్దల తీరు వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వినిపిస్తోంది. మంత్రుల శాఖలకు సంబంధించిన ఫైనాన్స్ బిల్లుల విషయంలో పలువురు మంత్రులు చెప్పుకోలేని ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. తమ శాఖలలో ఎమర్జెన్సీగా చేసే పనులకు సంబంధించిన బిల్లులు కూడా క్లియర్ కాకపోవడంతో మంత్రులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు మంత్రుల సన్నిహితులు చెబుతున్నారు. సీఎంతో సమీక్ష సమావేశాల సందర్భంగా పర్సనల్గా ఈ విషయాన్ని మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోతోందని మంత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యను సీఎంకి చెప్పుకున్నా బిల్లుల క్లియరెన్స్ విషయాన్ని ఆర్థికశాఖ మంత్రితోనే మాట్లాడాలని సీఎం చెబుతున్నారట. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క – ఇద్దరు, ముగ్గురు మంత్రుల బిల్లులు మాత్రమే వెంటవెంటనే క్లియర్ చేస్తూ, మిగతా మంత్రుల శాఖల ఎమర్జెన్సీ బిల్లులు సైతం నెలల తరబడి పెండింగ్లో పెడుతున్నారని కొందరు మంత్రులు వాపోతున్నారు.
Also Read : 70 వేల సభ్యత్వాలు.. ఏపీలో మంత్రి రికార్డు..!
పలువురు మంత్రులకు తమ శాఖల బిల్లులు క్లియర్ చేసుకునే విషయంలో వరుసగా చేదు అనుభవాలు ఎదురు అయ్యాయని విశ్వసనీయ సమాచారం. ఈ మధ్య ఢిల్లీ వెళ్లిన సదరు మంత్రులు నేరుగా పార్టీ పెద్దల వద్ద తమ గోడు వెళ్ళబోసుకున్నారట. ఇటీవలే పార్టీ ఏఐసీసీ నూతన కార్యాలయం ఓపెనింగ్ సందర్భంగా మంత్రులు ఢిల్లీ వెళ్లారు. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో తెలంగాణ మంత్రులు, ముఖ్యనేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కూడా బిల్లుల క్లియరెన్స్ అంశం మరోసారి చర్చించినట్టు సమాచారం. బిల్లులు రాక.. తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలువురు మంత్రులు కేసీ వేణుగోపాల్కి ఫిర్యాదు చేశారట. తమ శాఖల ఎమర్జెన్సీ బిల్లులు కూడా నెలల తరబడి పెండింగ్లో ఉంటే శాఖల పరంగా ఒత్తిడి ఎదుర్కొవాల్సి వస్తుందని మంత్రులు ఆవేదన వ్యక్తం చేశారట. దీంతో.. కేసీ వేణుగోపాల్ – తెలంగాణ ప్రభుత్వంలో ఏం జరుగుతుందనే విషయంపై ఫోకస్ చేసినట్లు సమాచారం.
Also Read : జగన్ ను కాపాడేది నువ్వే.. అమిత్ షా పై షర్మిల ఘాటు వ్యాఖ్యలు
గతంలో కర్ణాటకలో సైతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇదే పరిస్థితి ఏర్పడిందన్న విషయాన్ని రాజకీయ పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. ఆ రాష్ట్రంలో కొన్ని శాఖలకు సంబంధించిన బిల్లులు మాత్రమే క్లియర్ అవుతుండటం, మిగతావి పెండింగ్లో పెట్టడంతో అక్కడి మంత్రులు సైతం ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదు చేశారు. కర్ణాటక ప్రభుత్వ పెద్దలను ఢిల్లీ పిలిపించుకున్న కేసీ వేణుగోపాల్ మంత్రుల మధ్య సయోధ్య కుదిర్చారు. ప్రతీశాఖకు నెలనెల కొంత అమౌంట్ రిలీజ్ చేయాలని, ఆయా మంత్రుల ఆమోదంతోనే బిల్లులు చేయాలనే కండిషన్ తీసుకొచ్చారట. సేమ్ టు సేమ్ అలాంటి విధానాన్నే తెలంగాణలో తీసుకురావాలని సూత్రప్రాయంగా కేసీ వేణుగోపాల్ తెలంగాణ ప్రభుత్వ పెద్దలకు సూచించినట్టు సమాచారం. మంత్రులకు ఆయా శాఖల బిల్లులు సకాలంలో రిలీజ్ చేయకపోతే వారు చులకన అవుతారని సూచించినట్లు తెలిసింది. దీనివల్ల ప్రభుత్వం ఇబ్బందులు పడుతుందని, ఈ సమస్య వెంటనే పరిష్కారం కావాలని కేసీ వేణుగోపాల్ తెలంగాణ నేతలకు చెప్పినట్లు సమాచారం.
Also Read : వచ్చిన పనేంటి.. చంద్రబాబు మాస్ వార్నింగ్..!
మొత్తమ్మీద.. బిల్లుల చెల్లింపు విషయంలో తెలంగాణ మంత్రులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారట. ఇప్పుడు హైకమాండ్ పెద్దలు ఇచ్చిన సూచనలతో బిల్లుల క్లియరెన్స్ విషయంలో మార్పు ఉంటుందా అన్న విషయం చూడాలి.

