తెలంగాణా స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్దమైంది. దాదాపు ఆరు నెలల నుంచి నానుతోన్న ఈ అంశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, ఆ తర్వాత ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలతో చర్చలు జరిపి షెడ్యూల్ ప్రకటించింది. కాసేపటి క్రితం తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసారు. తక్షణమే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినట్టు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ప్రకటించారు. అన్ని రాజకీయ పార్టీలతో చర్చలు జరిపిన తర్వాతనే నిర్ణయం తీసుకున్నామని, తెలంగాణలో 31 జిల్లాల్లోని 565 మండలాల్లో ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపింది.
Also Read : కరూర్లో ఘోర విషాదం – రాజకీయ సభల్లో పాఠం నేర్చుకోవాలిసిందే
5 దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని, రెండు దశల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయని ప్రకటించింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ మొదటి దశ ఎన్నికల నోటిఫికేషన్ అక్టోబర్ 9న విడుదల చేస్తామని, ఎంపీటీసీ, జడ్పీటీసీ మొదటి దశ నామినేషన్ల దాఖలుకు చివరి తేది అక్టోబర్ 11 అని తెలిపింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ రెండో దశ ఎన్నికల నోటిఫికేషన్ అక్టోబర్ 13న విడుదల చేస్తామని, ఎంపీటీసీ, జడ్పీటీసీ రెండో దశ నామినేషన్ల దాఖలుకు చివరి తేది అక్టోబర్ 15గా తెలిపింది.
Also Read : ఇంతకూ ఆ లేఖ నిజమేనా..?
అక్టోబర్ 23న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల తొలి విడత పోలింగ్ నిర్వహిస్తామని ప్రకటించింది. అక్టోబర్ 27న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల రెండో విడత పోలింగ్ జరుపుతామని, నవంబర్ 11న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ ఉంటుందని పేర్కొంది. మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉంటాయని, అక్టోబర్ 31న మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు, నవంబర్ 4న రెండోదశ గ్రామ పంచాయతీ ఎన్నికలు, నవంబర్ 8న మూడో దశ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని, గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగిన రోజే కౌంటింగ్ ఉంటుందని తెలిపారు.