హైదరాబాద్ కేబీఆర్ పార్క్ చుట్టూ చేపట్టిన రోడ్డు విస్తరణతో పాటు ఫ్లైఓవర్ల నిర్మాణం కోసం చేపట్టిన పనులతో ప్రముఖులకు తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇస్తోంది. నటుడు బాలకృష్ణతో పాటు, కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి నివాసాలకు జీహెచ్ఎంసీ అధికారులు మార్కింగ్ చేశారు. బంజారాహిల్స్ నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్టు వరకు రోడ్డు విస్తరణ కోసం ఈ పనులు చేపడుతున్నారు. కేబీఆర్ పార్కు రోడ్డు విస్తరణ పనులు పలువురు ప్రముఖులను మనస్తాపానికి గురి చేస్తున్నాయి. అందులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి జానారెడ్డితో పాటు సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, అల్లు అర్జున్ మామ కె.చంద్రశేఖర్రెడ్డి సహా పలువురు బడా వ్యాపారవేత్తలున్నారు.
Also Read : అమరావతికి మరో మణిహారం.. బాబు కీలక ప్రకటన
జూబ్లీహిల్స్ మహారాజ అగ్రసేన్ కూడలి నుంచి చెక్పోస్టు వరకు కేబీఆర్ పార్కు హద్దు పొడవునా రోడ్డు విస్తరణ పనులు, పార్కు చుట్టూ ఉన్న ఆరు కూడళ్ల అభివృద్ధి పనులను ప్రభుత్వం చేపడుతోంది. కేబీఆర్ పార్క్ జాతీయ ఉద్యానవనం కావడంతో హద్దు పొడవునా కొంత భూమి ‘ఎకో సెన్సిటివ్ జోన్’గా ఉంటుంది. బీఆర్ఎస్ సర్కారు SRDP పేరుతో 2016లో కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లైఓవర్లు నిర్మించేందుకు ప్రయత్నించింది. అయితే.. ఆయా ఫ్లైఓవర్ల పిల్లర్లు ఎకో సెన్సిటివ్ జోన్లో నిర్మిస్తున్నారంటూ పర్యావరణవేత్తలు జాతీయ హరిత ట్రిబ్యునల్ NGTని ఆశ్రయించి ప్రాజెక్టును రద్దు చేయించారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం డిజైన్లను మార్చి ఎకో సెన్సిటివ్ జోన్ను తాకకుండా నిర్మాణాలన్నింటినీ రోడ్డు వైపున చేపట్టాలని, అవసరమైన చోట ప్రైవేటు ఆస్తులను సేకరించాలని నిర్ణయించింది.
Also Read : మోడీ 1… బాబు 2… జగన్ 3… ముగ్గురూ ముంచేశారు
బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి, మహారాజ అగ్రసేన్, ఫిల్మ్నగర్, జూబ్లీహిల్స్ రోడ్డు నం.45, చెక్పోస్టు, కేబీఆర్ పార్కు ప్రధాన గేటు కూడళ్లలో రూ.1,200 కోట్లతో ఏడు ఉక్కు వంతెనలు, ఆరు అండర్పాస్లను నిర్మించే పనుల్లో వేగం పెంచింది. ఒమేగా ఆసుపత్రి సమీపంలో జానారెడ్డికి రెండు ప్లాట్లున్నాయి. వాటిని 43 అడుగుల మేర రోడ్డు కోసం సేకరించాల్సి వస్తోంది. దాదాపు 700 గజాలు ఆయన నష్టపోవచ్చని తెలుస్తోంది. ఇక హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణ ఇల్లు రోడ్డు నం.45, 92 కూడలి వద్ద ఉండటంతో రెండు వైపులా భూసేకరణ చేపట్టాల్సి ఉందని, దాదాపు సగం భూమి నష్టపోతారని అంచనా వేస్తున్నారు అధికారులు. అటు.. పనులను ముందుకు తీసుకెళ్లడంపై తెలంగాణ ప్రభుత్వం పట్టుదలగా ఉందని, బాధితులందరికీ నచ్చజెప్పి భూసేకరణకు ఒప్పిస్తుందని అధికారులు చెబుతున్నారు.




