తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ముహుర్తం దాదాపు ఖరారైన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయ్యింది. అయితే… తొలి నాళ్లలో ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం సహా… మరో పది మంది మాత్రమే మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. నాటి నుంచి ఇప్పటి వరకు మంత్రివర్గ విస్తరణపై పలు తేదీలు ప్రచారం అయ్యాయి. అలాగే పలువురు నేతల పేర్లు కూడా బాగా వినిపించాయి. అయితే అవేవీ జరగలేదు. టీ పీసీసీ చీఫ్ ఎంపిక సమయంలో కూడా మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అంతా భావించారు. మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టి అప్పుడే మూడు నెలలు దాటిపోయింది కూడా. కానీ మంత్రివర్గ విస్తరణ మాత్రం జరగలేదు.
Also Read: అమరావతి నిర్మాణం అప్పటి వరకు పూర్తి కాదా…?
అయితే తాజాగా మంత్రివర్గ విస్తరణ ముహుర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. సంక్రాంతి పండుగ లోపు లేదా స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఉంటుందని ఇప్పటికే కాంగ్రెస్ నేతలు వెల్లడించారు. మంత్రివర్గంలో మొత్తం 6 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అయితే మంత్రివర్గాన్ని పూర్తిస్థాయిలో విస్తరించిన తర్వాత ఫిబ్రవరిలో పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై రాహుల్ గాంధీతో భేటీలో కూడా సీఎం, డిప్యూటీ సీఎంలు ప్రస్తావించగా… అందుకు అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. సీఎం, డిప్యూటీ సీఎం పర్యటన తర్వాత ఆశావహులంతా హస్తిన బాట పడుతున్నారు.
ఏడాది నుంచి పదవి కోసం పలువురు నేతలు భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఇందుకోసం పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు కూడా చేశారు. అయితే మంత్రివర్గ విస్తరణ పూర్తిస్థాయిలో ఉంటుందా… లేక పాక్షికంగా నలుగురు లేదా ముగ్గురితో సరిపెడతారా అనే విషయం తెలియాల్సి ఉంది. సామాజిక కూర్పు, జిల్లాల వారీగా ప్రాతినిధ్యంపై ఇప్పటికే నేతలు లెక్కలేస్తున్నారు. ప్రస్తుత మంత్రివర్గంలో ముదిరాజ్, కాపు, మాదిగ, మైనార్టీ సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం లేదు. అలాగే హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నేతలకు కూడా అవకాశం దక్కలేదు. ఇక విద్య, హోం, మునిసిపల్, సంక్షేమం, మైనింగ్ వంటి కీలక శాఖలన్నీ ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే ఉన్నాయి. దీంతో ఆయా శాఖలకు ప్రత్యేక మంత్రులను కేటాయిస్తారనే ప్రచారం కూడా వినిపిస్తోంది.
Also Read: మీవల్లే ఇదంతా.. ఎస్పీలు, డీఎస్పీలపై చంద్రబాబు ఫైర్
ఆదిలాబాద్ జిల్లా నుంచి గడ్డం వివేక్, ప్రేమ్ సాగర్ రావు, నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, హైదరాబాద్ నుంచి దానం నాగేందర్, శ్రీగణేష్, ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్, నల్గొండ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బీర్ల ఐలయ్య యాదవ్, బాలు నాయక్, మహబూబ్నగర్ జిల్లా నుంచి వాకిటి శ్రీహరి ముదిరాజ్, కరీంనగర్ జిల్లా నుంచి అడ్లూరి లక్ష్మణ్, ఆది శ్రీనివాస్, వరంగల్ జిల్లా నుంచి కడియం శ్రీహరి పదవులు ఆశిస్తున్నారు. మరి ఢిల్లీ పెద్దల మదిలో ఎవరున్నారో తెలియాలంటే… మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

