తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సొంత పార్టీకి చెందిన కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరైతే ఘాటు విమర్శలు కూడా చేస్తున్నారు. ఇందుకు ప్రధానంగా పుంగనూరు నియోజకవర్గానికి చెందిన పార్టీ కార్యకర్త రామకృష్ణనాయుడుని వైసీపీ గూండాలు హత్య దారుణంగా హత్య చేయడమే కారణం. చంద్రబాబు సొంత జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన పుంగనూరు నియోజకవర్గం చండ్రమాకులపల్లి పంచాయతీ కృష్ణాపురం గ్రామానికి చెందిన రామకృష్ణ నాయుడు అనే టీడీపీ కార్యకర్తను వైసీపీ గూండాలు హత్య చేశారు. రామకృష్ణ నాయుడు కుటుంబం తొలి నుంచి టీడీపీలో క్రియాశీలకంగా ఉంది. గ్రామంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాడు. అలాగే గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరఫున పోలింగ్ ఏజెంటుగా కూడా కూర్చున్నాడు.
Also Read: కూటమి పార్టీలను విడగొట్టడానికి ఎవరో రానవసరం లేదు..!
ఇక ఏపీలో కూటమి అధికారంలోకి రావడంతో.. ఫలితాలు వెలువడిన రోజు గ్రామంలో పటాసులు కాల్చాడు. అయితే అప్పుడే రామకృష్ణనాయుడును పెద్దిరెడ్డి అనుచరులు బెదిరించారు. నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలిచారని… కాబట్టి సంబరాలు చేసుకోవద్దని దాడి చేశారు. నాటి నుంచి రామకృష్ణనాయుడుతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై కూడా పెద్దిరెడ్డి అనుచరులు నాలుగు సార్లు దాడులు చేశారు. ఇదే విషయంపై గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు.. దాడి చేసిన వెంకటరమణ అనే వైసీపీ అభిమానిని పిలిపించిన సీఐ శ్రీనివాసులు.. దాడులు చేయవద్దు అని మందలించి పంపేశారు. ఆ తర్వాత మరింత రెచ్చిపోయిన వెంకటరమణ.. మరోసారి రామకృష్ణనాయుడు కుమారుడిపై ట్రాక్టర్తో దాడి చేశాడు.
Also Read: బాబు ప్రయోగం సక్సెస్ అవుతుందా..?
దీంతో 15 రోజుల క్రితం తనకు ప్రాణహనీ ఉందంటూ రామకృష్ణనాయుడు వీడియో ద్వారా పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా సరే.. పోలీసులు మాత్రం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదు. పోలీసుల అండతోనే మాజీ మంత్రి పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు వెంకటరమణ కత్తితో దారుణంగా రామకృష్ణనాయుడును హత్య చేశాడు. రామకృష్ణనాయుడు హత్యతో టీడీపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు కూడా తన్నులు తినాలా అని ప్రశ్నిస్తున్నారు. అసలు ఏపీలో టీడీపీ అధికారంలో ఉందా అని నిలదీస్తున్నారు. కార్యకర్తను దారుణంగా హత్య చేస్తుంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని విమర్శిస్తున్నారు.
Also Read: వైసీపీ యాక్టివ్ మోడ్.. రంగంలోకి సజ్జల..!
పెద్దిరెడ్డి అక్రమాల గురించి ప్రభుత్వానికి తెలియదా అని నిలదీస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రయ్య, ఇప్పుడు రామకృష్ణనాయుడు… ఇలా పార్టీ కోసం ఇంకెంత మంది ప్రాణాలు కోల్పోవాలని నిలదీస్తున్నారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటికీ… చాలా చోట్ల వైసీపీ అనుకూల పోలీసులే ఉన్నత పదవుల్లో ఉన్నారని.. వీరి అండతోనే వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా వైసీపీ అనుకూల అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే రామకృష్ణ నాయుడుని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. పసుపు జెండా మోసిన కూలీల ఆర్తనాదాలు మీకు వినపడటం లేదా.. అంటూ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ప్రశ్నిస్తున్నారు.

