గత అయిదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ లో పాలన మరియు అభివృద్ధి పడకేసిన సంగతి తెలిసిందే. ఇక కంపెనీలు కూడా రాష్ట్రానికి వచ్చిన పరిస్థితి లేదు. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో రాష్ట్రంలో పెట్టుబడులను లక్ష్యంగా చేసుకుని సిఎం చంద్రబాబు కష్టపడుతున్నారు. పలు కంపెనీలను రాష్ట్రానికి ఆహ్వానించే ప్రయత్నం చేస్తున్నారు ఆయన. తాజాగా టాటా గ్రూప్ తో చర్చలు జరపడం హాట్ టాపిక్ అయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ భేటీ అయ్యారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో పట్టుబడుల అంశంపై కీలక చర్చ జరిగింది.
ఏపీలో పారిశ్రామికాభివృద్ది, స్వర్ణాధ్రప్రదేశ్- విజన్ 2047 రూపకల్పన అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. పారిశ్రామిక అభివృద్దికి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు, ప్రణాళికలు అందించేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం. దేశంలో పేరున్న పారిశ్రామిక వేత్తలు, ఆయా రంగాల నిపుణులతో దీనిని ఏర్పాటు చేయనున్నారు. సిఎం చైర్మన్ గా, టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ కో చైర్మన్ గా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనుంది ఏపీ ప్రభుత్వం. 2047 నాటికి ఏపీని నెంబర్ 1 స్టేట్ చేసే లక్ష్యంతో విజన్ 2047 ప్రభుత్వం తయారు చేస్తోంది.
ఈ నేపధ్యంలో పారిశ్రామికాభివృద్దికి చేపట్టాల్సిన చర్యలపై టాస్క్ ఫోర్స్ పని చేస్తుంది. అమరావతిలో సిఐఐ భాగస్వామ్యంతో స్టేట్ ఆఫ్ సెంటర్ ఫర్ గ్లోబల్ లీడర్ షిప్ సంస్థ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది సర్కార్. ఈ సంస్థ ఏర్పాటులో టాటా గ్రూప్ కూడా భాగస్వామి కానుంది. విశాఖలో టిసిఎస్ డెవల్మెంట్ సెంటర్ ఏర్పాటు, ఎపిలో ఎయిర్ ఇండియా, విస్తారా ఎయిర్ లైన్స్ విస్తరణ అంశాలపై టాటా గ్రూప్ చైర్మన్ తో చంద్రబాబు చర్చించారు. రాష్ట్రంలో సోలార్, టెలీకమ్యునికేషన్స్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది.




