తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయంగారి చాతుర్మాస దీక్ష సంకల్పం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. శ్రీ వైష్ణవ సంప్రదాయకర్త శ్రీ రామానుజాచార్యుల పారంపర్యంలో చాతుర్మాస దీక్ష విశేషమైంది. ఆషాడ శుద్ధ ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్లి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటారని ప్రాశస్త్యం. కావున ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాస్యం అంటారు. చాతుర్వ్రతం ప్రాచీనకాలం నుండి ఆచరణలో ఉన్నట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది.
Also Read : మళ్ళీ ఢిల్లీకి బాబు.. ఏపీకి మోడీ
ముందుగా శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి మఠంలో కలశ స్థాపన, కలశ పూజ, విష్వక్సేనారాధన, మేదినిపూజ, మృత్సంగ్రహణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. తరువాత సేకరించిన పుట్ట మన్నుకు ప్రత్యేక పూజలు నిర్వహించి చాతుర్మాస సంకల్పం స్వీకరించారు. అనంతరం శ్రీ పెద్దజీయంగారు తిరుమల బేడి ఆంజనేయస్వామివారి ఆలయం పక్కనున్న జీయ్యంగారి మఠం వద్ద నుండి శ్రీ చిన్నజీయంగారు, ఇతర శిష్యబృందంతో బయల్దేరారు. తిరుమల క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ స్వామి పుష్కరిణి, శ్రీ వరాహస్వామివారి బాలాలయాన్ని సందర్శించారు. అక్కడి నుంచి మంగళవాయిద్యాలతో శ్రీవారి ఆలయానికి విచ్చేశారు.
Also Read : కవిత ఒంటరి అయిపోయారా..? గులాబీ మద్దతు ఎక్కడ..?
శ్రీవారి ఆలయ మహద్వారం వద్ద టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు, ఈవో జె.శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఇతర ఆలయ అధికారులతో కలిసి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. శ్రీ జీయంగార్లు శ్రీవారిని దర్శించుకున్న తరువాత శ్రీ పెద్దజీయంగారికి మేల్చాట్ వస్త్రాన్ని, శ్రీ చిన్నజీయంగారికి నూలుచాట్ వస్త్రాన్ని బహూకరించారు. అనంతరం శ్రీపెద్దజీయర్ మఠంలో శ్రీ పెద్దజీయర్స్వామి, శ్రీ చిన్నజీయర్స్వామి కలిసి ఈవో, అదనపు ఈవోలను శాలువతో సన్మానించారు.

