ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణం పరిణామాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఈ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ ఎంటర్ కావడం, దేశ వ్యాప్తంగా గురువారం సోదాలు జరపడం సంచలనంగా మారింది. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ తో పాటుగా కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీలో కూడా సోదాలు చేసారు. ఈ సోదాల్లో కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, రాజ్ కేసిరెడ్డిలను అరెస్ట్ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
Also Read : నేతలకు జగన్ డెడ్ లైన్..!
ఈ కేసులో నిందితులకు తాజాగా ఏసీబీ రిమాండ్ కూడా పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో మరో కీలక పరిణామం ఆసక్తిని కలిగిస్తోంది. సిట్ కస్టడీకి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని కోర్ట్ అనుమతించడంతో.. నేటి నుంచి ఆయన్ను విచారిస్తోంది. నేడు, రేపు మిథున్ రెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. మద్యం కుంభకోణం కేసులో ఏ4గా ఉన్న మిథున్రెడ్డి.. మద్యం కుంభకోణం కేసులో కీలకంగా వ్యవహరించారని ప్రాథమికంగా గుర్తించింది. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి ఆయనను సిట్ కస్టడీకి తీసుకుంది.
Also Read : ఓటు చోరీపై రాహుల్ ఆరోపణల హైలెట్స్ ఇవే
విజయవాడలోని సిట్ కార్యాలయంలో మిథున్ రెడ్డిని సిట్ ప్రశ్నించనుంది. విచారణ అనంతరం మిథున్ రెడ్డిని రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి సిట్ తరలించనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విచారణకు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. మిథున్ రెడ్డిని సిట్ విచారించిన అనంతరం ఈడీ విచారణకు తీసుకునే అవకాశం ఉంది. ఈ కేసులో రూ. 3, 500 కోట్ల మేర స్కాం జరిగినట్లు సిట్ అధికారులు గుర్తించారు. కాగా ఈ కేసులో ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలు బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే.