వైసీపీ అధికార పత్రిక సాక్షి మూసేస్తున్నారా.. సాక్షి ఛానల్ ప్రసారాలు కూడా నిలిచిపోనున్నాయా.. అంటే.. అవుననే సమాధానమే వస్తుంది. వాస్తవానికి సాక్షి మీడియాను జగతి పబ్లికేషన్ పేరుతో 2008 మార్చి 23న నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు. జగతి పబ్లికేషన్ సంస్థ పుట్టుకే అవినీతిమయం అని అప్పట్లోనే తెలుగుదేశం పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. అయితే అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో జగతి పబ్లికేషన్ సంస్థకు బ్రేక్ పడలేదు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధినేతగా జగతి పబ్లికేషన్ సంస్థను ప్రారంభించారు. తొలి నాళ్లలో వైఎస్ కుటుంబ భజన చేసిన సాక్షి… ఆ తర్వాత నుంచి జగన్, వైసీపీకి కరపత్రంగా మారిపోయింది. జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ విచారణ ప్రధానంగా జగతి పబ్లికేషన్ చుట్టూనే తిరిగింది. క్విడ్ ప్రో కో పద్ధతిలో భారీగా అవినీతి జరిగిందని.. నాటి వైఎస్ ప్రభుత్వం పెట్టుబడి దారులకు అయాచిత లబ్దీ చేకూర్చడం ద్వారా వారంతా సాక్షి సంస్థలో పెట్టుబడులు పెట్టారనేది ప్రధాన ఆరోపణ. జగన్ పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శంకర్రావు సీబీఐకి ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఈడీ.. సాక్షి సహా వైఎస్ కుటుంబ ఆస్తులపై విచారణ చేపట్టింది.
Also Read : వంశీని వైసీపీ వదిలేసినట్లేనా..?
2004 ఎన్నికల నాటి వైఎస్ఆర్ అఫిడవిట్కు 2009లో వైఎస్ జగన్ దాఖలు చేసిన అఫిడవిట్కు భారీగా తేడా వచ్చింది. జగన్ తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పదవిని అడ్డం పెట్టుకుని భారీగా అక్రమార్జన చేసినట్లు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ.. ఈ కేసులో 3 రోజుల పాటు జగన్ను విచారించి.. చివరికి అరెస్టు చేసింది. ఇదే సమయంలో ఈడీ కూడా సాక్షి సంస్థలో అక్రమ పెట్టుబడులున్నట్లు గుర్తించింది. ఈ నేపథ్యంలోనే మార్చి 5, 2014న ఏకంగా 863 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. జగన్కు చెందిన కార్మెల్ సంస్థతో పాటు జగతి పబ్లికేషన్స్ ఆస్తులను కూడా ఈడీ జప్తు చేసింది. అలాగే క్విడ్ ప్రో కో కేసులో భాగంగా ప్రముఖ పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్ ఆస్తులను కూడా ఈడీ జప్తు చేసింది. ఈడీ జప్తు చేసిన ఆస్తుల్లో జగన్కు చెందిన ఇందిరా టెలివిజన్ వంద కోట్ల షేర్లు ఉన్నాయి. జగతి పబ్లికేషన్స్కు చందిన 366 కోట్ల ఆస్తులు కూడా ఉన్నాయి. 11 కోట్ల విలువ చేసే జగన్ వ్యక్తిగత ఆస్తులను జప్తు చేసింది. సండూర్ పవర్లోని 57 కోట్ల జగన్ వాటాలను కూడా ఈడీ జప్తు చేసింది.
Also Read : కుప్పం వైసీపీ కొప్పు ఊడుతుందా…?
ఇక జగతి పబ్లికేషన్స్లో క్విడ్ ప్రో కో జరిగినట్లు గుర్తించిన ఈడీ.. వైఎస్ జగన్ సతీమణి భారతిని కూడా నిందితురాలిగా చేరుస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టులో ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. వాస్తవానికిక అక్రమాస్తుల కేసులో భారతి పేరును సీబీఐ తన ఛార్జ్ షీట్లో చేరుస్తుందని అంతా భావించారు. కానీ సీబీఐకి బదులుగా ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. దీంతో త్వరలో వైఎస్ భారతి కూడా అరెస్టు అవుతారనే ప్రచారం కూడా జోరుగా నడిచింది. అయితే వైఎస్ జగన్ తన రాజకీయ చతురతను ప్రదర్శించాడు. వాస్తవానికి 2014 కంటే ముందే సాక్షి సంస్థ మూసేస్తారనే పుకార్లు షికారు చేశాయి. ఆ సమయంలో సంస్థలో పనిచేస్తున్న పలువురు సీనియర్ ఉద్యోగులు కూడా సైలెంట్గా సైడ్ అయిపోయారు. అయితే నాటి యూపీఏ సర్కార్ పెద్దలతో పాటు బీజేపీలోని కొందరు నేతలతో జగన్ సన్నిహితులు వరుస మంతనాలు జరిపారు. మంచి డీల్ కుదుర్చుకోవడంతో ఈ మూసివేత వ్యవహారం పూర్తిగా పక్కన పెట్టినట్లు అయ్యింది. అయితే జగతి పబ్లికేషన్ ఆస్తులను ఈడీ జప్తు చేసిన వెంటనే సంస్థ స్టే ఆర్డర్ తెచ్చుకుంది. ఒక దశలో జీతాలకు కూడా అవకాశం లేకుండా సీజ్ చేశారని.. కాబట్టి వెసులుబాటు ఇవ్వాలంటూ కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. దీంతో జప్పు చేసిన ఆస్తులపై కోర్టు స్టే ఇచ్చింది. నాటి నుంచి నేటి వరకు కూడా స్టే మీదనే జగతి పబ్లికేషన్ సంస్థ నడుస్తోంది.
Also Read : టార్గెట్ జగన్.. వైసీపీ నేతల తీరు..!
2012 నుంచి 2019 వరకు ప్రతి శుక్రవారం కోర్టు వాయిదాలకు హాజరైన జగన్.. 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత వాయిదాలకు హాజరు కాకుండా మినహాయింపు తెచ్చుకున్నారు. అలాగే బీజేపీలోని కొందరు వైసీపీతో లాలూచీ పడటంతో.. అక్రమాస్తుల కేసు విచారణ ముందుకు సాగలేదు. అయితే నాటి ఎంపీ, ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు ఫిర్యాదుతో ఈ కేసు విచారణ మరోసారి ముందుకు కదిలింది. అక్రమాస్తుల కేసులో రోజు వారీ విచారణ జరిపించాలని కోర్టులో రఘురామ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో జగతీ పబ్లికేషన్స్పై ఉన్న స్టే వ్యవహారం మరోసారి బయటకు వచ్చింది. దీనిపై దృష్టి పెట్టిన ఈడీ, సీబీఐ అధికారులు.. కేసు విచారణలో భాగంగా త్వరలో సాక్షి పత్రిక, ఛానల్ను సీజ్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. సాధ్యమైనంత త్వరలోనే ఈ దిశగా చర్యలుంటాయంటున్నారు ఈడీ అధికారులు. ఈ విషయం ముందుగానే గుర్తించిన సంస్థలోని కొందరు ఉద్యోగులు.. నెమ్మదిగా తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది.