సినీ హీరో అల్లు అర్జున్ కు పోలీసులకు షాక్ ఇచ్చారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనకు సంబంధించి శుక్రవారం మధ్యాహ్నం అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేసారు. ఈ అరెస్ట్ తో ఒక్కసారిగా సినిమా పరిశ్రమ షాక్ అయింది. మహిళ మరణానికి అల్లు అర్జున్ కారణం అంటూ… పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఏ విధమైన ముందస్తు సమాచారం లేకుండా థియేటర్ వద్దకు అల్లు అర్జున్ చేరుకున్నాడని, దీనితో అభిమానులను అదుపు చేయలేకపోయామని పోలీసులు పేర్కొన్నారు.
Also Read : కేటిఆర్ అరెస్ట్ కు రంగం సిద్దం… గవర్నర్ గ్రీన్ సిగ్నల్…?
ఇప్పటికే థియేటర్ యాజమాన్యాన్ని పోలీసులు అరెస్ట్ చేసారు. తాజాగా అల్లు అర్జున్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేసారు. ఈ పరిణామంతో రాజకీయ ప్రముఖులు సిఎం రేవంత్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు రేవంత్ లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ తరుణంలో సిఎం రేవంత్ రెడ్డి స్పందించారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో రేవంత్ మీడియాతో మాట్లాడారు. అల్లు అర్జున్ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు రేవంత్ రెడ్డి.
Also Read : బ్రేకింగ్: అల్లు అర్జున్ అరెస్ట్… షాక్ లో టాలీవుడ్
ఇందులో నా జోక్యం ఏమీ ఉండదు అంటూ స్పష్టం చేసారు. చట్టం ముందు అందరూ సమానులే అన్నారు రేవంత్. చట్టపరమైన ప్రక్రియ జరుగుతుందని… తొక్కిసలాటలో ఒకరు చనిపోయిన నేపథ్యంలో పోలీసులు చర్యలు తీసుకుంటున్నారన్నారు. మోహన్ బాబు విషయంలో కోర్టు ఉత్తర్వులున్నాయని రేవంత్ స్పష్టం చేసారు. ఇక తన ఢిల్లీ పర్యటనలో క్యాబినెట్ విస్తరణ పై చర్చ లేదన్నారు. ఓవైపు సీరియస్ గా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయని… ఇంకో వైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయన్నారు. క్యాబినెట్ విస్తరణ జరగాలంటే పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం, ముఖ్యనేతలతో చర్చలు జరగాలన్నారు రేవంత్.

