భారతీయ రైల్వే వ్యవస్థ ఆధునీకత దిశగా పరుగులు పెడుతోంది. ఇప్పటికే వందే భారత్ వంటి సెమీ హైస్పీడ్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. త్వరలో వందే భారత్ స్లీపర్ రైళ్లు కూడా పట్టాలెక్కనున్నాయి. ఇక దేశంలోని అన్ని రైల్వే ట్రాక్లను కూడా ఇప్పటికే హై స్పీడ్ రైళ్ల రాకపోకలకు అనుగుణంగా అప్ గ్రేడ్ చేస్తున్నారు. చాలా రైళ్లు ఇప్పటికే 120 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెడుతున్నాయి.
Also Read : హైదరాబాద్ లో బెజవాడ మైనర్లు సంచలనం..!
రైళ్లల్లో ప్రయాణించే వారికి రైల్వే శాఖ మెరుగైన సౌకర్యాలు అందిస్తోంది. ముఖ్యంగా ముందస్తు రిజర్వేషన్ చేసుకున్న వారికి ఎలాంటి అసౌకర్యం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రధానంగా రాత్రి సమయంలో భద్రతను కట్టుదిట్టం చేసింది. దాదాపు అన్ని బోగీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అలాగే ఏసీ బోగీల్లో ప్రయాణం చేసే వారికి ప్రత్యేకంగా దుప్పటి, బెడ్ షీట్, దిండు అందిస్తోంది రైల్వే శాఖ. గరీభ్ రథ్లో కూడా దీని కోసం ప్రత్యేకంగా చెల్లిస్తే.. వీటిని ఇస్తారు. ప్రతి కోచ్లో ఉన్న సిబ్బంది.. వాటిని ప్రయాణీకులకు అందిస్తారు.
తాజాగా స్లీపర్ కోచ్లో ప్రయాణం చేసే వారికి కూడా ఇలాంటి సదుపాయం అమలు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. దీనిని ప్రయోగాత్మకంగా చెన్నై కేంద్రంగా నడుస్తున్న సదరన్ రైల్వే డివిజన్ అమలు చేసేందుకు ముందుకు వచ్చింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి నాన్ ఏసీ స్లీపర్ కోచ్ రైళ్లల్లో కూడా దుప్పటి, బెడ్ షీట్, దిండు ఇవ్వాలని నిర్ణయించారు. అయితే ఇందుకు ప్రత్యేక చార్జీలు వసూలు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
Also Read : రైతులతో గ్యాప్ ఉంది.. చంద్రబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ముందుగా చెన్నై నుంచి రాకపోకలు సాగించే 10 రైళ్లల్లో ఈ విధానం అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వీటి కోసం ప్రత్యేకంగా చెల్లించాల్సి ఉంటుంది. ఒక బెట్ షీట్, ఒక దిండు, కవర్కు 50 రూపాయలు, ఒక దిండు, కవర్కు 30 రూపాయలు, ఒక దుప్పటి మాత్రమే అయితే 20 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. వీటిని ఆన్ డిమాండ్ – ఆన్ పేమెంట్ విధానంలో ఇస్తామన్నారు. ముందుగా రిజర్వేషన్ చేసుకునే సమయంలోనే చెల్లింపు చేయవచ్చు. లేదా.. రైలులో ఉన్న సిబ్బందికి చెల్లించి వీటిని తీసుకోవచ్చని అధికారులు తెలిపారు. వీటి నిర్వహణను ప్రత్యేక ఏజెన్సీ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కేవలం 12 గంటల లోపు ప్రయాణం ఉన్న రైళ్లల్లో మాత్రమే ఈ విధానం పరిశీలిస్తున్నారు. దీనిపై వచ్చిన స్పందన మేరకు అమలు తీరుపై సమీక్ష చేయనున్నారు.

