పాకిస్తాన్ పరిస్థితి రోజు రోజుకూ దిగజారి పోతోంది. పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్కు సింధు జలాలను భారత్ పూర్తిగా నిలిపివేసింది. దీంతో పాకిస్తాన్లో తీవ్ర ఆర్థిక సంక్షోభం తలెత్తింది. వ్యవసాయం కుంటుపడటంతో అన్ని ధరలు ఆకాశాన్ని అంటాయి. అదే సమయంలో భారత్ నుంచి సహాయం పూర్తిగా నిలిచిపోవడంతో నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోయాయి. దీంతో పాకిస్తాన్లో ద్రవ్యోల్బణం అక్కడి ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. నిత్యావసర వస్తువుల ధరలు పెరగటంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా టమాటా ధర పాకిస్తాన్ వాసులను భయపెడుతోంది. కిలో టమాటా ఇప్పుడు ఏకంగా 400 రెట్లు పెరిగిన 600 రూపాయలు దాటేసింది. ఈ పెరుగుదల ఇప్పుడు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ దుస్థితికి అద్దం పడుతోంది.
Also Read : సూపర్.. దుమ్ము రేపారు.. చంద్రబాబు ఆసక్తికర కామెంట్స్..!
పాకిస్తాన్ పార్లమెంట్లో టమాట ధరలపై చర్చ పెద్ద దుమారం రేపింది. ఒక టమాటాను పార్లమెంట్లోని తీసుకువచ్చిన ఎంపీ.. దాని కోసం 75 రూపాయలు ఖర్చు చేసినట్లు చెప్పారు. అది కూడా చాలా కష్టంగా దొరికిందని చెప్పడంతో ప్రతిపక్షాలు పాకిస్తాన్ ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. పాకిస్తాన్ – ఆఫ్ఘనిస్తాన్ మధ్య అక్టోబర్ 11వ తేదీ నుంచి వాణిజ్య లావాదేవీలు పూర్తిగా నిలిచిపోయాయి. సరిహద్దు చెక్ పోస్టులు మూసివేయడంతో సరుకులు, కూరగాయల దిగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. దీని వల్ల రోజుకు సుమారు 1 మిలియన్ అమెరికన్ డాలర్ల నష్టం జరుగుతోంది. సుమారు 5 వేల కంటైనర్లు సరిహద్దుల్లో నిలిచిపోయాయి. వాటిల్లో కూరగాయలు పూర్తిగా చెడిపోయాయి.
Also Read : సాక్షి కులం రాతలు.. కాపు మహిళపై ప్రచారం
ప్రస్తుతం పాకిస్తాన్లో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కిలో టమాటా ధర 600, బెండకాయలు 300, అల్లం 750, వెల్లుల్లి 400, ఉల్లిపాయలు 200, క్యారెట్లు 250 రూపాయలు పలుకుతున్నాయి. ఏపీలో 10 రూపాయల విలువైన కొత్తిమీర కట్ట పాకిస్తాన్లో 80 రూపాయలు పైనే పలుకుతోంది. దీంతో ఇప్పుడు అన్ని ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని అంటుతున్నాయి. భారత్ నుంచి వ్యాపార లావాదేవీలు కొనసాగిన సమయంలో పాకిస్తాన్ ప్రజలు సుఖంగా ఉన్నారని.. ఇప్పుడు అన్ని విధాలుగా ఇబ్బందులు పడుతున్నారని ప్రతిపక్ష ఎంపీ పార్లమెంట్లో ఆరోపించారు. పాకిస్తాన్లో పరిస్థితి రోజు రోజుకు దిగజారి పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే పాకిస్తాన్ ప్రభుత్వం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

