ఈ రోజుల్లో ఉప ఎన్నికలు అనగానే అధికార పార్టీలతో పాటుగా ప్రతిపక్షాలకు కూడా ఓ సవాల్ గా మారాయి. రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకునే ఉప ఎన్నికల విషయంలో.. అభ్యర్థి ఎంపిక నుంచి.. ఎన్నికల ఫలితాల వరకు ఖర్చు తడిచి మోపెడు అవుతూ ఉంటుంది. ఎన్నికల్లో గెలవకపోతే ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందనే విషయం ప్రజల్లోకి వెళుతుందనే.. ఆందోళనలో అధికార పార్టీలు.. ప్రభుత్వంపై తాము చేసే విమర్శలు ఎన్నికల్లో గెలిస్తే మరింతగా ప్రజల్లోకి వెళ్తాయని ప్రతిపక్షాలు.. ఉప ఎన్నికల విషయంలో నానా కష్టాలు పడుతూ ఉంటాయి. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఏ స్థాయిలో జరిగిందో చూసాం.
Also Read : టీడీపీ – వైసీపీ మధ్య విమానాల గోల..!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష నేత కేసిఆర్, బిజెపి నాయకులు ఈ ఎన్నికను ఎంతో సీరియస్ గా తీసుకున్నారు. పోటీ మాత్రం కాంగ్రెస్ వర్సెస్ భారత రాష్ట్ర సమితిగా నడిచింది. కానీ ఖర్చు మాత్రం వాచిపోయింది అంటున్నాయి లెక్కలు. దాదాపుగా రెండు పార్టీల నుంచి 80 నుంచి 90 కోట్లు ఇక్కడ ఖర్చు చేసి ఉండవచ్చని అనధికారిక లెక్కలు చెబుతున్నాయి. దీనితో ఇప్పుడు మళ్లీ ఉప ఎన్నికలంటే ఎమ్మెల్యేలు భయపడే పరిస్థితి ఏర్పడింది. అధికారంలో ఉన్న పార్టీలకు అది పెద్ద సమస్య కాకపోయినా.. పోటీ చేయాలనుకునే ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులకు మాత్రం ఇది ఒక సవాల్ అనే చెప్పాలి.
ఇప్పుడు తెలంగాణలో మరో రెండు ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. దానం నాగేందర్, కడియం శ్రీహరి లపై అనర్హత వేటుపడే అవకాశాలు ఉండవచ్చని తెలుస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో తెలంగాణ స్పీకర్ విచారణ వేగవంతం చేశారు. సికింద్రాబాద్ ఎంపీగా దానం నాగేందర్ కాంగ్రెస్ తరపున పోటీ చేయడంతో ఆయనపై అనర్హత ఖచ్చితంగా పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే కడియం శ్రీహరి కూడా అనర్హతకు గురి అయ్యే అవకాశాలు ఉండటంతో.. వారి వారి నియోజకవర్గాల్లో ఎన్నిక తప్పనిసరి అయ్యే పరిస్థితి ఉంది. సార్వత్రిక ఎన్నికలకు మరో మూడేళ్లు ఉండటంతో ఉప ఎన్నికలు జరగాల్సి ఉంటుంది.
Also Read : హిడ్మాకు సోషల్ మీడియాలో షాకింగ్ క్రేజ్.. వైరల్ అవుతోన్న తల్లి దీన స్థితి..!
అయితే ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తే మాత్రం ఖర్చు భారీగా ఉండే అవకాశం ఉండటంతో.. సీటు ఆశించే అభ్యర్థులు భయపడుతున్నారు. సాధారణ ఎన్నికలతో పోలిస్తే ఇక్కడ ఖర్చు రెండింతలు ఉంటుంది. ప్రచారానికి భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఎన్నికల ముందు జరిగే కొన్ని వ్యవహారాలకు కూడా భారీగా ఖర్చు చేయాలి. ఉప ఎన్నికలంటే డబ్బులకు, బహుమతులకు ఓటర్లు ఆశ చూపిస్తున్నారు. పెద్ద కుటుంబాలకు భారీగా డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి కూడా అభ్యర్థులకు ఏర్పడింది. సామాజిక వర్గాల లెక్కలు కూడా ఖర్చును భారీగా పెంచేస్తున్నాయి. దీనితో ఇప్పుడు ఉప ఎన్నికల్లో రాజీనామా చేసే అవకాశం ఉన్న అభ్యర్థులు పోటీ చేస్తారా అనేదే ప్రధాన ప్రశ్న.

