“అబద్ధం ఊరు మొత్తం తిరిగేలోపు నిజం గడప దాటుతుంది” అనే నానుడి మరోసారి విషాదకరంగా నిజమైంది. నిరాధార ఆరోపణల వల్ల ఒక నిరపరాధి జీవితం ముగిసిన సంఘటన కేరళ రాష్ట్రాన్ని తీవ్రంగా కలచివేసింది.
దీపక్ అనే యువకుడు కేరళలోని ఒక వస్త్ర పరిశ్రమలో ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల ఆయన కేరళ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే బస్సులో ప్రయాణించగా, సీట్లు లేకపోవడంతో నిలబడాల్సి వచ్చింది. అదే సమయంలో బస్సులో ఉన్న ఒక యువతి సెల్ఫీ వీడియో తీసి, దీపక్ తనను అసభ్యంగా తాకాడని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే ఆ వీడియోలో దీపక్ ఆమెను తాకినట్లు లేదా అసభ్యంగా ప్రవర్తించినట్లు ఎలాంటి స్పష్టమైన ఆధారాలు కనిపించలేదు. ఆ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో దీపక్ తీవ్ర అవమానానికి గురయ్యాడు. స్వభావంలో మృదువైన, గొడవలకు దూరంగా ఉండే వ్యక్తిగా పేరున్న దీపక్, ఈ ఘటనను తట్టుకోలేక తన గదిలో బలవన్మరణానికి పాల్పడ్డాడు.
Also Read : కవిత–పీకే భేటీ: తెలంగాణ రాజకీయాల్లో నూతన శకం
దీంతో ఆయన నివసించే గోవిందాపురం గ్రామం విషాదంలో మునిగిపోయింది. ఈ ఘటన కేరళ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీపక్పై ఆ యువతి చేసిన ఆరోపణలు నమ్మశక్యం కాకపోవడంతో స్థానికులు ఈ విషయాన్ని మీడియా దృష్టికి తీసుకువచ్చారు. విషయం సోషల్ మీడియాలో మరింత విస్తరించడంతో దేశవ్యాప్తంగా దీపక్కు సానుభూతి వెల్లువెత్తింది. ప్రభుత్వ స్థాయికి ఈ అంశం చేరడంతో సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి. పోలీసులు దర్యాప్తు చేపట్టి, ఈ ఘటనలో దీపక్కు ఎలాంటి ప్రమేయం లేదని, ఆయన అసభ్యకరంగా ప్రవర్తించలేదని నిర్ధారించారు.
Also Read : షర్మిల మౌనం… మార్పుకు సంకేతమా?
దాంతో కోజికోడ్ పోలీసులు ఆ యువతిపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆమె పోలీసుల అదుపులో ఉంది. ప్రాథమిక దర్యాప్తులో, సోషల్ మీడియాలో గుర్తింపు పొందాలనే ఉద్దేశంతో ఆమె ఈ తప్పుడు ఆరోపణలకు పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే ఈ నిర్లక్ష్యమైన చర్య వల్ల ఒక యువకుడి నిండు జీవితం నశించిందని నెటిజన్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన, సోషల్ మీడియాలో బాధ్యతారాహిత్యంగా చేసే ఆరోపణలు ఎంతటి ఘోరమైన పరిణామాలకు దారి తీస్తాయో తెలియజేసే విషాదకర ఉదాహరణగా నిలిచింది.

