విజయవాడ వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. విజయవాడలో ఉగ్రవాద సానుభూతిపరులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో.. బెజవాడ వాసులు కలవరపాటుకు గురయ్యారు. ఉగ్రవాదులకు అనుకూలంగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారనే సమాచారం అందుకున్న కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు విజయవాడ నగరంలోని వించిపేటలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఉగ్రవాద గ్రూపులకు సానుభూతిపరులుగా వ్యవహరిస్తున్న ముగ్గురు యువకులు సామాజిక మాధ్యమాల్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేలా పోస్టులు పెడుతున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఆ ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Also Read : బ్రేకింగ్: యుద్ధం ఆపేస్తున్నాం, ట్రంప్ సంచలన ప్రకటన
కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు దాడులు చేయడం, ముగ్గురు ఉగ్రవాద సానుభూతిపరులను అదుపులోకి తీసుకోవడం బెజవాడ వాసులను ఉలికిపాటుకు గురిచేశాయి. వించిపేట గాంధీ బొమ్మ సెంటర్ సమీపంలో ఒక భవనంపై కొద్ది రోజులుగా కొందరు యువకులు గది అద్దెకు తీసుకుని నివసిస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఉగ్రవాద సంస్థలకు చెందిన కంటెంట్తో పాటు వీడియోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ముగ్గురు యువకుల వద్ద నుంచి సెల్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డిజిటల్ ఆధారాలు, మొబైల్ ఫోన్లను అధికారులు విశ్లేషిస్తున్నారు.
Also Read : బోట్ల చోరీలో ఎంపీ హస్తం..? క్లారిటీ ఇచ్చిన బీద మస్తాన్..!
ఉగ్రవాద సానుభూతిపరులను అదుపులోకి తీసుకున్న ఇంటెలిజెన్స్ అధికారులు.. వారిని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. యువకులు ఇచ్చిన సమాచారం మేరకు విజయవాడ సహా కాకినాడ, విశాఖ, తిరుపతి, కర్నూలు, గుంటూరు పట్టణాల్లో కూడా ఇంటెలిజెన్స్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సోదాలకు సంబంధించి అధికారులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. పూర్తిస్థాయి దర్యాప్తు అనంతరం వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

