ఏపీ కేబినెట్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తిసుకుంది. మూడున్నర గంటలపాటు సాగిన మంత్రివర్గ సమావేశంలో అజెండా ముగిశాక వివిధ అంశాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. పేదలందరికీ ఇళ్ల విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలని సూచించారు. నివాస స్థలం లేనివారి జాబితా రూపొందించి అందరికీ దక్కేలా చూడాలని ఆదేశించారు. ఏడాదిలోగా నివాస స్థలం లేనివారికి లబ్ధి చేకూరేలా ప్రభుత్వ చర్యలు ఉండాలి.. ప్రభుత్వం చేసే మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో చొరవ చూపాలని స్పష్టం చేశారు.
Also Read : జూబ్లీహిల్స్ లో కమ్మ సామాజికవర్గం మద్దతు ఎవరికి?
విశాఖలో జరగనున్న సీఐఐ సమ్మిట్పై మంత్రులతో చర్చించిన సీఎం చంద్రబాబు… ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. పెట్టుబడుల భాగస్వామ్య సదస్సుపై యువతకు అవగాహన కల్పించాలని సూచించారు. సదస్సులోని చర్చలు, ఒప్పందాలను విద్యార్థులకు తెలియజేయాలన్నారు. పుట్టపర్తిని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేలా చర్యలు చేపట్టాలని, పెద్దిరెడ్డి అక్రమాలపై ఆధారాలతో సహా వీడియోలు తీయించానని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అనగా.. పవన్ పనితీరును సీఎం చంద్రబాబు, సహచర మంత్రులు ప్రశంసించారు.
Also Read : మంచి చెడు తెలియట్లేదు.. ఎమ్మెల్యేలపై లోకేష్ ఫైర్
ఎర్రచందనం డిపో సందర్శనపై తన అనుభవాలు పంచుకున్న పవన్ కల్యాణ్.. పలు సూచనలు కూడా చేసారు. పట్టుబడిన ఎర్రచందనంతో పరికరాలు తయారీ ప్రతిపాదనలను పరిశీలిద్దామని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేల గురించి మాట్లాడిన సీఎం.. ఎమ్మెల్యేలు తప్పు చేస్తుంటే ఇన్ఛార్జ్ మంత్రులే సరిచేయాలని సూచించగా.. మంత్రులందరికీ మీరే విషయం గట్టిగా చెప్పాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అనేక వివాదాలపై రెండు పార్టీలు రాజీ పడినప్పటికీ కొంతమంది ప్రజాప్రతినిధులు ఒప్పుకోవడం లేదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. మీరు ఈ విషయమై అందరికీ గట్టిగా చెప్పాలని సీఎం చంద్రబాబును పవన్ కోరారు.

