జనసేన పార్టీ ఎమ్మెల్యేల విషయంలో పవన్ కళ్యాణ్ సీరియస్ గా ఉన్నారా…? పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించి పవన్ ఎప్పటికప్పుడు తన బృందంతో నివేదికలు తెప్పించుకుంటూ, పరిశీలిస్తూ వార్నింగ్ లు ఇస్తున్నారా…? అంటే అవుననే సమాధానమే వినపడుతుంది. ఇటీవల శాసన సభా సమావేశాల్లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే ఎవరిని అయినా సరే తాను క్షమించే ప్రశ్నే లేదని పవన్ స్పష్టం చేసారు. ప్రభుత్వానికి ఎమ్మెల్యేలు ఎవరైనా ఇబ్బందులు పెట్టాలనుకుంటే రాజీనామాలు కూడా చేయాల్సి వస్తుందని అన్నారు.
ఇక పవన్ కళ్యాణ్ లో ఒక కోణం చూసి టీడీపీ నేతలు సైతం షాక్ అవుతున్నారట. ప్రభుత్వంలోకి వచ్చి రెండు నెలలు కూడా కాక ముందే పవన్ కళ్యాణ్ వేస్తున్న అడుగులు ఆశ్చర్యపరుస్తున్నాయట. అసలు ఏం జరుగుతుంది జనసేనలో అనేది చూద్దాం. తనతో పాటు మంత్రులుగా ఉన్న వాళ్లకు మొత్తం శాఖలపై పట్టు పెంచుకోవాలని ఆయన ఇప్పటికే సూచించారు. ఇక ఎమ్మెల్యేల విషయానికి వస్తే తనతో పాటుగా గెలిచిన 20 మంది నియోజకవర్గాల మీద పవన్ దృష్టి పెట్టి నెలకొకసారి నివేదికలు ఇచ్చే విధంగా టీం ని పెట్టారట.
ఇసుక అక్రమాలు, గ్రానైట్, మట్టి ఇలా ఎన్నో విషయాల మీద పవన్ దృష్టి పెట్టారట. ఎమ్మెల్యేలు ఎవరైనా ఇసుక అక్రమాల్లో ఉన్నారని తెలిస్తే అరెస్ట్ కూడా చేయిస్తా అని పవన్ ఇచ్చిన వార్నింగ్ తో ఎమ్మెల్యేలు షాక్ అయ్యారట. జనసేన మండల స్థాయి నేతల మీద కూడా పవన్ దృష్టి పెట్టారట. కష్టపడే వాళ్లకు నామినేటెడ్ పదవులు ఇస్తామని లేని వాళ్లకు పదవులు ఉండవని ఆయన స్పష్టంగా చెప్పారట. అలాగే అధికారులు ఎవరైనా పదోన్నతులు కావాలంటే ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుంటే మాత్రం క్షమించే ప్రశ్నే లేదని అన్నారట. ఇక టీడీపీ నేతలకు సహకరించకుండా ఆ పార్టీ ఎమ్మెల్యేలను ఇబ్బంది పెట్టాలనుకున్న వాళ్ళను సైతం రాజీనామాలు చేయించేందుకు సైతం తాను సిద్దంగా ఉన్నట్టు పవన్ చెప్పడంతో జనసేనలో అలజడి మొదలైంది.

