వైసీపీ హయాంలో బినామీ కంపెనీలను అడ్డం పెట్టుకుని సంపాదించిన వాళ్ళపై ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. తాజాగా ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేసారు. షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ కు భూకేటాయింపులపై సమగ్ర విచారణ చేయాలని అధికారులను ఆదేశించారు. దీనిపై సత్వరమే నివేదిక ఇవ్వాలని పవన్ ఆదేశించారు. షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీకి చెందిన భూములు శేషాచలం వైల్డ్ లైఫ్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోకి వస్తాయని వచ్చిన కథనాలపై నివేదిక ఇవ్వాలని పవన్ స్పష్టం చేసారు.
Also Read : కాంగ్రెస్కు బీఆర్ఎస్ షాక్ ఇస్తుందా..?
షిరిడీ సాయి కంపెనీకి కేటాయించిన భూముల్లో అటవీ భూముల క్రమబద్దీకరణ చట్టం 1980 నిబంధనలు పూర్తిగా గాలికి వదిలేశారని, అటవీ చట్టాలను పూర్తిగా ఉల్లంఘించి కేటాయింపులు జరిపారని కథనాలు రాగా వాటిపై పవన్ కళ్యాణ్ స్పందించారు. భూ కేటాయింపులు, సంబంధిత వివరాలు నివేదిక రూపంలో అందజేయాలని, కేటాయింపుల ప్రక్రియపైనా వివరాలు ఇవ్వాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. వన్యప్రాణుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేసారు. సామాజిక మాధ్యమాల్లో జరిగిన ప్రచారంపై కూడా పవన్ స్పందించారు.
Also Read : భారత్ సింధూ నది నీళ్ళను నిజంగా ఆపగలదా..? వాస్తవాలు ఇవే..!
తిరుపతిలోని శేషాచలం అడవులకు ఆనుకుని ఉన్న ఉపాధ్యాయనగర్ గ్రాండ్ వాల్ట్ రోడ్డులో అటవీ సరిహద్దు కంచె ధ్వంసం కావడంతో వన్యప్రాణులు దప్పిక కోసం, తిండి కోసం బయటకు వస్తూ ప్రాణాపాయ పరిస్థితిలోకి వెళ్తున్నాయని సోషల్ మీడియాలో పలు వీడియోలు వైరల్ అయ్యాయి. దీనిపై స్పందించిన పవన్ కళ్యాణ్.. వెంటనే తగు చర్యలు తీసుకోవాలని తిరుపతి అటవీ, బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ పరిధిలో ఉన్న ఫెన్సింగ్ కు తగిన మరమ్మతులు చేయాలని ఆదేశించారు.

