పార్లమెంట్ అంటే చాలు… అందరికీ ఠక్కున గుర్తుకు వచ్చేది దేశ రాజధాని ఢిల్లీ. బడ్జెట్ మొదలు.. శీతాకాల సమావేశాల వరకు ప్రతి ఏటా దాదాపు 150 రోజుల పాటు పార్లమెంట్ సమావేశాలు జరగటం ఆనవాయితీ. లోక్సభ, రాజ్యసభ సమావేశాల్లో పలు కీలక అంశాలు చర్చిస్తారు… కీలక బిల్లులను ఆమోదిస్తారు కూడా. అయితే ఈ పార్లమెంట్ సమావేశాలను దక్షిణాదిలో కూడా నిర్వహించాలనే ప్రతిపాదన ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తోంది. వాస్తవానికి పార్లమెంట్ సమావేశాలు దక్షిణ భారతదేశంలో కూడా నిర్వహించాలనేది చాలా ఏళ్ల నాడే వచ్చిన ప్రతిపాదన. కానీ ఇప్పటి వరకు దానిపై అంతగా ఎవరూ దృష్టి పెట్టలేదు.
Also Read : హైకోర్టులో వర్మకి భారీ ఊరట
కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ప్రతిపాదన హాట్ టాపిక్గా మారింది. ప్రతి ఏటా దిపావళి ముందు నుంచి ఢిల్లీలో వాతావరణం పూర్తిగా మారిపోతుంది. పంజాబ్, హర్యానాలో పంట వ్యర్థాలు పెద్దఎత్తున తగులబెట్టడం వల్ల ఆ కాలుష్యం ఢిల్లీపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది. దీని వల్ల ఎయిర్ క్వాలిటీ పూర్తిగా పడిపోతుంది. ప్రస్తుతం దేశ రాజధాని గ్యాస్ ఛాంబర్ను తలపిస్తోంది. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇస్తున్నారు. విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. పొగ మంచు కారణంగా ఢిల్లీలో ఉదయం పది వరకు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఉష్ణోగ్రత మైనస్ డిగ్రీలకు చేరుతోంది.
ప్రస్తుత వాతావరణ పరిస్థితుల వల్ల ఉపిరితిత్తుల సమస్యలు వస్తాయని వైద్యులు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. ఇదే సమయంలో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిర్వహిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న ఎంపీలంతా ప్రస్తుతం ఢిల్లీలో పార్లమెంట్కు హాజరవుతున్నారు. అయితే ఇలాంటి వాతావరణ పరిస్థితుల్లో సభ నిర్వహించడం సబబు కాదనేది కొందరు ఎంపీల వాదన. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పార్లమెంట్ శీతాకాల సమావేశాలను దక్షిణాదిలో నిర్వహించాలని రాజ్యసభ ఛైర్మన్, లోక్సభ స్పీకర్, ప్రధాని, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రికి కొందరు ఎంపీలు లేఖలు రాస్తున్నారు.
Also Read : మహా సిఎం ఫైనల్.. కొలిక్కివచ్చిన రాయ’బేరాలు’
ఇందుకు ఉదాహరణగా ప్రతి ఏటా డిసెంబర్ నెలలో రాష్ట్రపతి హైదరాబాద్కు వింటర్ వెకేషన్కు వస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ ఉభయ సభల నిర్వహణకు అన్ని విధాలుగా సేఫ్ అనేది తెలంగాణ ఎంపీల మాట. బెంగళూరు లేదా హైదరాబాద్ నగరాల్లో శీతాకాల సమావేశాలు నిర్వహించడం వల్ల ఎలాంటి ఇబ్బందులు రావనేది దక్షిణాది ఎంపీల సూచన. గతంలో జమ్ము కశ్మీర్ కలిసే ఉన్నప్పుడు… అసెంబ్లీ సమావేశాలు ఇలాగే నిర్వహించారని గుర్తు చేస్తున్నారు. కాబట్టి ప్రస్తుత శీతాకాల సమావేశాల నుంచే ఈ విధానం అమలు చేయాలని కొందరు ఎంపీలు కోరుతున్నారు.