తెలుగుదేశం పార్టీలో పదవుల కోసం ఎదురు చూస్తున్న వారి జాబితా రోజురోజుకు పెరిగిపోతోంది. పార్టీ అధికారంలోకి వచ్చి ఆరు నెలలైంది. అయితే ఇప్పటికి కేవలం పట్టమని 50 మందికి కూడా పదవులు దక్కలేదు. దీంతో చాలా మంది సీనియర్లు పదవులు వస్తాయా రావా అని చర్చించుకుంటున్నారు. ఇప్పటికే కొంతమంది నేతలు పార్టీ అధినేతపై గుర్రుగా ఉన్నారు. మరికొందరైతే.. పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉన్నారు. అయితే కొందరు మాత్రం ఇప్పటికీ తమకు అప్పగించిన విధులను యధావిధిగా నిర్వర్తిస్తూనే అధినేత పిలుపు కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.
టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నానా పాట్లు పడిన నేతల్లో సరిగ్గా పది మందికి కూడా నామినేటెడ్ పదవులు దక్కలేదు అనేది వాస్తవం. పట్టాభి వంటి ఒకరిద్దరు మినహా… గత ప్రభుత్వంలో తీవ్ర ఇబ్బందులు పడిన వారికి సరైన గుర్తింపు లభించలేదనే చెప్పాలి. వైసీపీ ప్రభుత్వంలో కేసులు, ట్రోలింగ్, మార్ఫింగ్, దాడులకు గురైన వారిలో పట్టుమని పది మందికి కూడా చంద్రబాబు పదవులు ఇవ్వలేదు అనేది వాస్తవం. మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీల్లో ఒకరిద్దరికి మాత్రం మళ్లీ పదవులిచ్చిన చంద్రబాబు… అనుబంధ సంఘాలకు చెందిన వారిలో సగం మందికి పైగా పదవులివ్వలేదు. అయితే వీరికి మూడో జాబితాలో అవకాశం వస్తుందని అంతా భావిస్తున్నారు.
Also Read : రేవంత్ మాటకు విలువ లేదా…?
అలాగే పార్టీ పదవులు కూడా భర్తీ చేయాల్సి ఉంది. ఏపీ పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు మంత్రిపదవి వస్తుందనే ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే ఆ పదవిని మరొకరికి ఇవ్వాల్సి ఉంది. అలాగే తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న వంగలపూడి అనితను హోమ్ మంత్రిని చేశారు. ఆ పదవి కూడా మరొకరికి ఇవ్వాల్సి ఉంది. అలాగే ఎస్సీ సెల్, బీసీ సెల్ అధ్యక్షులను నియమించాలి. పార్టీ కోసం కష్టపడిన వారికి న్యూ ఇయర్ గిఫ్ట్ వస్తుందని అంతా భావిస్తున్నారు. ఐదేళ్లుగా వైసీపీ సర్కార్ వేధింపులకు గురైన మాజీ మంత్రి దేవినేని ఉమా, ప్రొద్దుటూరు నేత డా.ప్రవీణ్ కుమార్ రెడ్డి, టీఎన్టీయూసీ కార్యదర్శి, తాడిపత్రి నేత సోమశేఖర్ నాయుడు, మాజీ ఎమ్మెల్యేలు గుండ లక్ష్మీదేవి, కలమట వెంకటరమణ, పిఠాపురం వర్మ, కేఎస్ జవహర్, బూరుగుపల్లి శేషారావు, సుగుణమ్మతో పాటు రెండేళ్లుగా జాతీయ స్థాయి మీడియా ఛానల్స్లో వైసీపీని కడిగేస్తున్న అధికార ప్రతినిధి తిరునగరి జ్యోత్స్న, ఆచంట సునీత, కోణతాల రత్నకుమారి వంటి నేతలకు పదవులు దక్కాల్సి ఉంది. అయితే మొన్నటి చంద్రబాబు, పవన్ భేటీ అనంతరం ఫైనల్ లిస్ట్ వస్తుందని అంతా భావించారు. కానీ అది రాలేదు. న్యూ ఇయర్ లోపు అయినా వస్తే.. కొత్త సంవత్సర వేడుకలను సంతోషంగా చేసుకుంటామని నేతలు భావిస్తున్నారు.

