ఆంధ్రప్రదేశ్ లో గత సర్కార్ చేసిన అప్పుల గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రతీ నెల వేల కొట్లలో అప్పులు చేస్తూ పాలన సాగించింది జగన్ సర్కార్. ఇప్పుడు అసలు ఆ అప్పుల వాటా ఎంత ఉంది అనేది ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. 2019లో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాతి నుంచి 2024లో అధికారం కోల్పోయే వరకు… అప్పులు పెరుగుతూనే వచ్చాయి. జీఎస్డీపీలో అప్పుల వాటా 36 శాతానికి చేరుకుందని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ (ఎన్ఐపీఎఫ్పీ) తమ నివేదికలో పేర్కొంది.
ఈ రుణాలను 20 శాతంలోపు నియంత్రించడం ప్రభుత్వానికి సవాల్ అంటూ ‘స్టేట్ ఫోరమ్-2023’ పేరుతో విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. 2019-20లో ఆంధ్రప్రదేశ్ జీఎస్డీపీలో రుణాలు 24.48 శాతం కాగా క్రమంగా అవి పెరుగుతూ వచ్చాయి. 2020-21లో 28.01 శాతానికి, 21-22లో 26.82 శాతానికి చేరినట్టు వెల్లడించింది. ఆ తర్వాతి నుంచి ఏకంగా పది శాతం పెరిగాయని పేర్కొంది. 2022-23 నాటికి ఏకంగా 36 శాతానికి చేరుకున్నట్లు తమ నివేదికలో వెల్లడించారు. ప్రతీ ఏటా వార్షిక రెవెన్యూ లోటు తీవ్రంగా పెరిగిపోయిందని అది ఇంకా పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.
Also Read : రహస్య ప్రదేశంలో వల్లభనేని వంశీ ఆశ్రయం
రాష్ట్ర రెవెన్యూ వ్యయంలో ఆర్థిక సేవల వాటా తగ్గినట్టు వెల్లడించింది. ఇక సాధారణ, సామాజిక సేవల భాగం పెరగగా… 47 శాతం సామాజిక సేవలపైనే వాటిని ఖర్చు పెట్టారని వెల్లడించింది. ఇతర కీలక రంగాల్లో నిధులను చాలా తక్కువ ఖర్చు చేసారు. 2019-20లో 9 శాతం, 20-21లో 8%, 21-22లో 7 శాతమే వాటిపై ఖర్చు చేసారు. విద్య, క్రీడలు, సాధారణ ఆర్థిక సేవలు, వ్యవసాయం, ఇంధనం, వైద్య ప్రజా ఆరోగ్యం, పరిశ్రమలు, ఖనిజ వనరులు, ఎస్సీలు, బలహీన వర్గాలు, సామాజిక భద్రత, పోషకాహారంపై చాలా తక్కువగా ఖర్చు పెట్టారు. రాష్ట్రంలో రెవెన్యూ వసూళ్లు బాగా తగ్గాయని వెల్లడించింది. అదే విధంగా ప్రజా ఆస్తుల నిర్మాణానికి ఉపయోగించే మూలధన వ్యయం భారీగా పడిపోయినట్టు తెలిపింది. జీఎస్డీపీలో 2.29 శాతమే ఉన్నట్టు పేర్కొంది.

