భారతదేశం పవిత్ర ప్రదేశాలకు కేంద్రం అని చెప్పుకోవడం అతిశయోక్తి కాదేమో. ఈ దేశంలో ఉన్నన్ని ఆధ్యాత్మికత ప్రదేశాలు మరేదేశంలో ఉండకపోవచ్చు. మన దేశంలో విస్తుగొలిపే గుడులు, గోపురాలు ఎన్నో ఎన్నెన్నో. ఒక్కొక్క ప్రదేశానికి ఒక్కొక్క ప్రత్యేకత. ప్రస్తుత విషయానికి వస్తే ప్రతి ఏడాదీ పెరుగుతున్న శివలింగం ఉన్న దేవాలయం సంగతి ఈరోజు మీకు వివరిస్తాను. ఈ దేవాలయంలో ప్రతి ఏడాది శివలింగం ఎత్తు పెరుగుతూ వస్తుందని భక్తులు చెబుతున్నారు. ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఇక్కడ శివలింగానికి అభిషేకాలు, పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
అయితే ఈ దేవాలయానికి సంబంధించిన అత్యంత ఆసక్తికరమైన విషయాలు చాలా ఉన్నాయి. ఇలాంటి విశేషమైన శివాలయం బీహార్లోని భోజ్పూర్ జిల్లాలోని ఆరా పట్టణంలో ఉంది. ఇక్కడ ఈ బుద్వా మహాదేవ్ దేవాలయం దేశంలోని పురాతన దేవాలయాల్లో ఒకటిగా ప్రసిద్ధిగాంచింది. ఈ దేవాలయానికి మహాభారతంతో ప్రత్యక్ష సంబంధం ఉందని భక్తులు బలంగా విశ్వసిస్తారు. పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు ఇక్కడ శివుడిని పూజించేవారని భక్తుల నమ్మకం.
భోజరాజు బుద్వా దేవాలయంలో మహాదేవుని పూజించేవాడని కూడా నమ్ముతారు. అయితే దేవాలయానికి సంబంధించిన అత్యంత ఆసక్తికరమైన విషయం దాదాపు చాలా మందికి తెలిసి ఉండదు. అది మీకు తెలిస్తే మీరు కూడా తప్పక అక్కడి దేవాలయంలోని మహాదేవున్ని దర్శించుకుంటారు. ముఖ్యంగా చెప్పాలంటే వేల సంవత్సరాల క్రిందట ఈ దేవాలయంలో ప్రవేశించిన శివలింగం కాలక్రమేనా ఎంతో ఎత్తుకు ఎదిగిందని భక్తులు నమ్ముతున్నారు. శివలింగం మొదట్లో చాలా చిన్నదిగా ఉండేదని.. కానీ ఇప్పుడు అది నాలుగు అడుగులకు పైగా ఎత్తుకు చేరుకుందని చెబుతున్నారు.
దేవాలయ పూజారి చెప్పిన వివరాల ప్రకారం తమ పూర్వికులు అనేక తరాలుగా దేవాలయ ప్రధాన అర్చకులుగా ఉన్నారని, వారంతా శివలింగం ఎత్తు పెరగడాన్ని చూశారని చెబుతున్నారు. అంతే కాకుండా ఈ శివలింగాన్ని అభిషేకించిన జలం చర్మ వ్యాధులను నయం చేసేందుకు ఉపయోగపడుతుందని భక్తులు నమ్ముతున్నారు. ఈ నమ్మకం భక్తులు ఇక్కడికి తరలి రావడానికి మరొక కారణం. ప్రతిరోజు వేలాది మంది శివ భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శిస్తున్నారు. ముఖ్యంగా శ్రావణమాసంలోనీ శివరాత్రి సమయంలో ఈ దేవాలయం అత్యంత రద్దీగా ఉంటుంది.