ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పడే ఎన్నికల వేడి రాజుకుంది. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య హోరాహోరీగా మాటల యుద్ధం జరుగుతోంది. ఇప్పటికే ప్రజాక్షేత్రంలో ప్రజల మద్దతు కోసం దూసుకుపోతున్న పార్టీల నేతలు, తమదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. వైసిపి ప్రజావ్యతిరేక విధానాలను టిడిపి, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ ప్రజాక్షేత్రంలోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తుంటే, వాటిని తిప్పికొట్టే పనిలో అధికార వైసీపీ పార్టీ నేతలు ఉన్నారు.
ప్రజా సంక్షేమం కోసం తాము అందిస్తున్న అనేక సంక్షేమ పథకాలను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ పాలనలో సాధించిన ప్రగతిని తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ నేతలు. అయితే వచ్చే ఎన్నికల యుద్ధానికి ప్రధానంగా సోషల్ మీడియాను అస్త్రంగా చేసుకుంటుంది వైసీపీ. గత ఎన్నికల సమయంలోనో ఇదే పంధా ఎంచుకుని విజయం సాధించిన జగన్, ఈసారి కూడా ఐప్యాక్ మరియు సోషల్ మీడియా పైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తున్నారు. ఇప్పటికే ప్రతిపక్షాలు వైసిపి వ్యతిరేక ప్రచారం చేస్తూ సోషల్ మీడియాలో పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారు.
పలు మీడియా సంస్థలు కూడా వైసీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాయని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక సభలు, సమావేశాలలో వాపోయారు. ఈ క్రమంలో ఈ పరిస్థితులకు చెక్ పెట్టటం కోసం యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేస్తున్నారు వైసీపీ నేతలు. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో 200కు పైగా యూట్యూబ్ ఛానల్స్ ను ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే గత రెండు నెలల కాలంలో 50 పైగానే యూట్యూబ్ ఛానల్స్ వైసిపికి అనుకూలంగా రంగంలోకి దిగాయి. ఇవి వ్యక్తిగత ఛానల్స్ అయినప్పటికీ వైసిపి కార్యక్రమాలను ప్రోత్సహించటం కొన్ని చానల్స్ చేస్తుంటే, మరికొన్ని వ్యూహాత్మకంగా వైసీపీ ని ప్రమోట్ చేస్తున్నాయి. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఇప్పుడు మారిన ఏపీ పరిస్థితిని పోల్చి చూపుతూ మరి కొన్ని ఛానల్స్ ఏపీలో ప్రస్తుతం అమలవుతున్న పథకాలను ప్రజాక్షేత్రంలోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి.
ఈ క్రమంలోనే మరిన్ని ఛానల్స్ తీసుకురావడానికి క్షేత్రస్థాయిలో ప్రోత్సహించాలని వైసిపి అధిష్టానం ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. మొత్తం 200 యూట్యూబ్ ఛానల్స్ తో ప్రత్యర్థుల వ్యూహాలకు చెక్ పెట్టాలని సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారని తెలుస్తుంది. ఇక ఇదే కనుక జరిగితే ఏపీలో వచ్చే ఎన్నికల్లో యూట్యూబ్ ఛానల్స్ మోత మోగిపోనుంది.