బెంగళూరు సమీపంలోని దేవనహళ్లి తాలూకాలోని చన్నరాయపట్న, చుట్టుపక్కల గ్రామాల్లో ఏరోస్పేస్ ప్రాజెక్టు కోసం చేపట్టదలచిన భూసేకరణ ప్రక్రియను కర్ణాటక ప్రభుత్వం ఉపసంహరించుకుంది. రైతుల తీవ్ర నిరసనల నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఈ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. ఏరోస్పేస్ ప్రాజెక్టు కోసం 17 వందల 77 ఎకరాలను సేకరించాలని కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం తొలుత భావించింది. అయితే, ఈ ప్రాంతంలోని రైతులు, భూ యజమానులు భూసేకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. పరిశ్రమలు తరలిపోయే అవకాశం ఉన్నప్పటికీ, రైతుల ప్రయోజనాలకు ప్రాధాన్యతనిస్తూ భూసేకరణను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రకటించారు.
Also Read : గంటకో బులిటెన్ వేసినా జనం నమ్మరు: ధూళిపాళ్ళ ఇంట్రస్టింగ్ కామెంట్స్
ఈ నేపథ్యంలో, పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన లక్ష్యంగా పరిపాలన సాగిస్తున్న ఏపీ సర్కార్.. ఏరోస్పేస్ ఇండస్ట్రీస్కు రెడ్ కార్పెట్ స్వాగతం పలికింది. దీనిపై ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒకసారి పరిశీలించాలని కోరారు. మీ కోసం మా వద్ద ఒక ఆకర్షణీయమైన ఏరోస్పేస్ పాలసీ ఉంది.. అంటూ ఆహ్వానించారు. ప్రోత్సాహకాలతో పాటు, బెంగుళూరుకు దగ్గరగా 8 వేల ఎకరాలకు పైగా భూమి కూడా అందుబాటులో ఉందన్నారు లోకేష్. త్వరలోనే కూర్చుని మాట్లాడుకోవాలని ఆశిస్తున్నా నారా లోకేశ్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు.
వాస్తవానికి ఏరో హబ్గా బెంగళూరుకు పేరు. ఎన్నో ఎయిర్ షోలను బెంగళూరులో నిర్వహించారు కూడా. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రభుత్వ పాలసీల్లో మార్పులు రావడంతో ఏరోస్పేస్ హబ్ కూడా మార్పులు చేస్తోంది. ప్రస్తుతం దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడుల ఆకర్షణపై దృష్టి సారించారు సీఎం చంద్రబాబు. పారిశ్రామికంగా ప్రగతి సాధిస్తే.. ఆదాయంతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి ఉంటుందనేది చంద్రబాబు మాట. అందుకే వెనుకబడిన అనంతపురం జిల్లాలో కియా కార్ల పరిశ్రమ తీసుకువచ్చారు. దీని వల్ల ఏటా వేల కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి వస్తోంది. వందల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పరిశ్రమల స్థాపనపై చంద్రబాబు దృష్టి పెట్టారు. ఇప్పటికే డ్రోన్ ఇండస్ట్రీకి ఏపీ కీ పాయింట్ గా ఎంపిక చేశారు. రాజధాని అమరావతిలో అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అవుతున్నాయి.
Also Read : ఆ విషయంలో జగన్ స్టాండ్ ఏమిటో..?
ఇక శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ప్రత్యేక ఏరో స్పేస్ పార్కులు, తయారీ కేంద్రాలను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే ఏపీలో విశాఖ, తిరుపతి, గన్నవరంలో అంతర్జాతీయ విమానాశ్రయాలున్నాయి. అలాగే కడప, కర్నూలు, పుట్టపర్తి, రాజమండ్రిలో కూడా విమానాశ్రయాలున్నాయి. వీటితో పాటు త్వరలో భోగాపురంలో అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు అందుబాటులోకి రానుంది. అమరావతిలో కూడా 5 వేల ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం కోసం భూములు కేటాయించారు. ఈ నేపథ్యంలో విజయవాడ, విశాఖపట్నం, తాడేపల్లిగూడెం, నాయుడుపేట ప్రాంతాల్లో ఇప్పటికే పెట్టుబడిదారులు ముందుకు వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో భూములు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఎంఎస్ఎంఈలకు తక్కువ ధరలోనే అందిస్తోంది ఏపీ సర్కార్.
Also Read : మంగళగిరిని షేక్ చేస్తున్న కార్ల స్కాం..!
చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అలాగే పరిశ్రమల ఏర్పాటుకు ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పారిశ్రామిక వేత్తల చూపు ఏపీ వైపు మళ్లింది. ఇప్పటికే అవనిగడ్డ సమీపంలో డిఫెన్స్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించారు. డ్రోన్ల తయారీకి కూడా ఏపీ హబ్గా మారనుంది. అంతరిక్ష పరిశోధన రంగాలలో ఆంధ్రప్రదేశ్ పెద్దగా ఎదుగుతోంది. విజయవాడలో ఎయిర్ ఇండియా ఇంజినీరింగ్ లిమిటెడ్ సంస్థ కొత్తగా మెయింటనెన్స్, రిపేర్, ఓవర్ హాల్ యూనిట్ ఏర్పాటు చేసింది. ఇక విశాకలో ఇస్రో, డీఆర్డీఓలు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించాయి. తొలి నుంచి పెద్దగా ఆలోచించే చంద్రబాబు.. ఏపీలో ఏరో స్పేస్ రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ రంగంలో ఉద్యోగావకాశాలు పుష్కలంగా ఉంటాయని చంద్రబాబు భావించారు. అందుకే ఏపీలో ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ కోసం ఏకంగా 8 వేల ఎకరాలను కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. దీని వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా కూడా వేల మందికి ఉపాధి లభిస్తుంది. ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది.