గత కొన్నాళ్లుగా ఎమ్మెల్యేల విషయంలో తీవ్ర అసంతృప్తిగా ఉన్న మంత్రి నారా లోకేష్ తాజాగా మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు ప్రజా సమస్యల విషయంలో అలసత్వం ప్రదర్శించడం, ప్రజా కార్యక్రమాలకు దూరంగా ఉండటం, కొందరు ఎమ్మెల్యేలు పదేపదే వివాదాల్లో ఉంటున్న అంశాలను సీరియస్ గా పరిగణిస్తున్న లోకేష్ తాజాగా.. మరోసారి ఎమ్మెల్యేల వైఖరి పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారికి మంచి చెడు తెలియడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉండవల్లి లోని సీఎం క్యాంప్ కార్యాలయంలో తెలుగుదేశం మంత్రులతో లోకేష్ సమావేశం నిర్వహించారు.
Also Read : వారి సంగతి ఎందుకు మర్చిపోయారు..?
తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలకు సీనియర్లతో అవగాహన కల్పించాలని సూచించారు. సమస్యలు ఎలా అధిగమిస్తున్నారో అవగాహన కొత్త ఎమ్మెల్యేలకు అవసరం అన్నారు. కొత్త ఎమ్మెల్యేలు వరుస విజయాలు కొనసాగించాలంటే మాత్రం లోటుపాట్లు సరి చేసుకోవాలని స్పష్టం చేశారు. ఈనెల 14, 15వ తేదీల్లో విశాఖ సదస్సును కలిసికట్టుగా విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు మంత్రి. సదస్సు ద్వారా రాష్ట్రానికి దాదాపు పది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని.. కాబట్టి అందరూ సీరియస్ గా తీసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు.
Also Read : జూబ్లీహిల్స్లో టీడీపీ ఓట్లు ఎవరికి..?
ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి అన్న మంత్రి.. ప్రతి మంత్రి తమ శాఖల పరిధిలో ఒప్పందాలకు సంబంధించి బాధ్యతతో నిర్వహించాలన్నారు. రేపు ఎం ఎస్ ఎం ఈ.. పార్కుల కార్యక్రమంలో మంత్రులందరూ విధిగా పాల్గొనాలని స్పష్టం చేశారు. ఇచ్చిన హామీ మేరకు 20 లక్షల ఉద్యోగాల కల్పన త్వరగా నెరవేర్చాలని.. దీనిపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు దృష్టి పెట్టాలన్నారు. కార్యకర్తలను, ప్రజలను తక్కువ అంచనా వేయవద్దని హెచ్చరించారు.

